Logo issue in Summit: విశాఖ సదస్సులో ‘లోగో’ ఇష్యూ! రంగు పడేలా ట్రోల్స్
విశాఖ కేంద్రంగా జరుగుతున్న పారిశ్రామిక వేత్తల సదస్సు లోగో వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే..
- Author : CS Rao
Date : 03-03-2023 - 4:00 IST
Published By : Hashtagu Telugu Desk
విశాఖ కేంద్రంగా జరుగుతున్న పారిశ్రామిక వేత్తల సదస్సు లోగో (Logo) వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే.. మూడు జామపళ్లను కొరుకుతున్న చిలుకను ఈ లోగోలో ప్రధానంగా పేర్కొన్నారు. పైగా ఆచిలుక తోకలకు కూడా వైసీపీ జెండా రంగులు వేశారు. ఆకుపచ్చ నీలం రంగులు పులిమేశారు. దీనిపై పెద్ద ఎత్తున నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మనకు పెట్టుబడులు పెట్టేవారు కావాలి కానీ.. మన దగ్గర ఉన్న సహజ సంపదను (జామపళ్లు) కొరుక్కుతినేవారు కాదని కామెంట్లు చేస్తున్నారు.
అదేసమయంలో ప్రపంచ వ్యాప్త సదస్సుకు కూడా వైసీపీ రంగులు పులమడం ఏంటని ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఈ లోగోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నం కానీ ప్రభుత్వం తాలూకు చిహ్నం కానీ.. ఎక్కడా లేకపోవడాన్ని సైతం వారు తప్పుబట్టారు. ఈ మార్పులు సూచించినా కూడా ప్రభుత్వం తన పంథాలోనే ముందుకు సాగిందని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రపంచస్థాయిలో పెట్టుబడుల సదస్సును ఏర్పాటు చేసింది. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో భారీ ఎత్తున వేసిన సెట్టింగ్స్ ఏర్పాట్ల మధ్య శుక్రవారం ఈ సదస్సును ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అధికారికంగా.. పెట్టుబడుల సదస్సుకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన లోగోను కూడా ఆవిష్కరించారు.
ఈ ‘లోగో’ (Logo) ను మంత్రులు వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడుల సదస్సకు సంబంధించి సన్నాహక సమావేశాలు నిర్వహించిన సమయంలోనే ప్రదర్శించారు. ఈ లోపు.. ఈ లోగోపై విమర్శలు.. సూచనలు కూడా వచ్చాయి. దీనికి కారణం.. ఈ లోగోను నిశితంగా గమనించినా..పైపైనే చూసినా.. పెట్టుబడుల సదస్సుకు సంబంధించిన లోగోలా కనిపించడం లేదన్నది నెటిజన్ల విమర్శ.
Also Read: BJP to TDP: టీడీపీలోకి బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు? మరో ఇద్దరు!