అమరావతిపై మళ్లీ అవే కుట్రలు.. L&T పైపులకు నిప్పు…!!
- Author : Vamsi Chowdary Korata
Date : 12-03-2026 - 12:40 IST
Published By : Hashtagu Telugu Desk
L&T pipes అమరావతి నిర్మాణం మళ్లీ ఊపందుకోవడంతో జీర్ణించుకోలేని శక్తులు కుట్రలకు తెరలేపాయి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతి పనులు శరవేగంగా సాగుతుండటాన్ని తట్టుకోలేక, కొందరు దుండగులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. గతంలో భూసమీకరణ సమయంలో చెరకు తోటలకు నిప్పు పెట్టి రైతులను భయాందోళనలకు గురిచేసిన తరహాలోనే, ఇప్పుడు నిర్మాణ సామాగ్రిని ధ్వంసం చేస్తూ నీచమైన రాజకీయానికి ఒడిగడుతున్నారు.
రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనుల కోసం ఎల్ అండ్ టీ సంస్థ తెచ్చిన భారీ పైపులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే, ఈ అగ్నిప్రమాదం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలిపోయిన పైపులు సాధారణంగా నిప్పు అంటుకునే రకానికి చెందినవి కావు. హై డెన్సిటీ మెటిరీయల్తో తయారు చేసినవి. అలాంటి పైపులు అగ్నికి ఆహుతి కావాలంటే పెట్రోల్ పోసి నిప్పు పెడితే తప్ప సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పైపులను భద్రపరిచిన ఆ బహిరంగ ప్రదేశంలో వంటలు చేయడం కానీ, నిప్పు పుట్టే ఇతర పనులు కానీ జరగడం లేదు. అయినప్పటికీ భారీగా మంటలు వ్యాపించాయంటే అది ముమ్మాటికీ దుండగుల పనే అని స్పష్టమవుతోంది. అమరావతిని నిర్వీర్యం చేయాలనే పాత కుట్రలే మళ్లీ బయటపడుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు, ఇన్వెస్టర్లను భయపెట్టేందుకు కొన్ని రాజకీయ శక్తులు ఏ రకమైన కుయుక్తులు పన్నాయో అందరికీ తెలిసిందే.