Mulapeta Port : ఏపీలో కొత్త పోర్ట్ ట్రయల్ రన్ మారిపోతున్న రూపురేఖలు!
- By Vamsi Chowdary Korata Published Date - 11:21 AM, Wed - 3 December 25
శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. వాటర్ బ్రేక్ వాల్ నిర్మాణం పూర్తయి, బెర్తుల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. అత్యాధునిక డ్రైడ్జర్లను దిగుమతి చేసుకోనున్నారు. పోర్టు నిర్మాణం 60% పూర్తయింది. రోడ్డు, రైల్వే ట్రాక్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుతో జిల్లా ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుంది. ఈ పనుల్ని వేగంగా పూర్తి చే సి త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన మూలపేట పోర్ట్ పనులు వేగవంతం అయ్యాయి. పోర్ట్ నిర్మాణంలో కీలకమైన వాటర్ బ్రేక్ తొలి దశ పూర్తయింది. 2,300 మీటర్ల సౌత్ వాటర్ బ్రేక్ వాల్, 580 మీటర్ల నార్త్ వాటర్ బ్రేక్ వాల్ నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం కొండ రాళ్లు, ఇండో పార్ట్స్ అమరిక పనులు జరుగుతున్నాయి. షిప్లు నిలిపే బెర్తుల నిర్మాణం కూడా వేగంగా సాగుతోంది. పోర్ట్ నిర్మాణంలో భాగంగా, బెర్త్ల వద్ద కాలువలు తవ్వడానికి రోజుకు 30 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని మూడు డ్రెడ్జింగ్ యంత్రాలతో తొలగిస్తున్నారు. త్వరలోనే అత్యాధునిక డ్రైడ్జర్లను విదేశాల నుంచి తీసుకురానున్నారు. ఈ డ్రైడ్జర్లు మరింత వేగంగా, సమర్థవంతంగా మట్టిని తొలగించడంలో సహాయపడతాయి.
షిప్లు నిలిపే బెర్తుల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.. ప్రస్తుతం ఫైలింగ్ దశ నుంచి బీమ్స్ దశకు వచ్చింది. పిల్లర్లను నాలుగు బెర్తుల్లో 64 మీటర్ల లోతు నుంచి ఏర్పాటు చేశారు. తూర్పు వైపున మూడు జనరల్ బెర్తులు, పశ్చిమాన ఒక కోల్ బెర్త్ నిర్మించనున్నారు. ఇప్పటికే రెండు జనరల్ బెర్తుల పనులు దాదాపు పూర్తయ్యాయి. అంతేకాదు కోల్ బెర్త్ ఫైలింగ్ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఈ పోర్ట్ నిర్మాణం పూర్తయితే, శ్రీకాకుళం జిల్లాకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది.
కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో మూలపేట పోర్టు నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పోర్ట్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పోర్టు నిర్మాణంలో 60 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. అనుకున్న సమయానికి పోర్టును అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు. పోర్టుకు వెళ్లే రోడ్డు నిర్మాణంపై కూడా ఫోకస్ పెట్టారు.. ఈ మేరకు అక్కడ గ్రావెల్ పనులు పూర్తయ్యాయి. నౌపడలో ఒక ఫ్లైఓవర్, క్రీక్ దగ్గరకు దారిని ఏర్పాటు చేయాల్సి ఉంది. మూలపేట పోర్టు నుంచి రైల్వే ట్రాక్ లైన్ కోసం మట్టి చదును చేసే పనులు స్పీడ్ అందుకున్నాయి. కూర్మనాథపురం, యామలపేట, పోతునాయుడుపేట, కోటపాడు గ్రామాల్లో ఈ పనులు జరుగుతున్నాయి. నౌపడలో విద్యుత్ సౌకర్యం కోసం స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. పోర్టుకు సంబంధించిన పరిపాలన భవనాలు, నాలుగు పెద్ద గోదాముల నిర్మాణం ప్రారంభమైంది. త్వరలో ట్రయల్ రన్ నిర్వహించాలని భావిస్తున్నారు.