Nara Lokesh: మహానాడును విజయవంతం చేద్దాం : మంత్రి నారా లోకేశ్
- Author : Vamsi Chowdary Korata
Date : 23-05-2026 - 2:50 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడును ఈసారి క్లస్టర్ల స్థాయిలో ఒక పండుగ వాతావరణంలో, కలిసికట్టుగా విజయవంతం చేయాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. హైబ్రిడ్ విధానంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడు సన్నాహకాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,875 క్లస్టర్ ఇంఛార్జ్లతో ఆయన ఆన్లైన్ ద్వారా సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈసారి మహానాడును ‘స్త్రీ శక్తి మహానాడు’ అనే థీమ్తో నిర్వహిస్తున్నామని, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
హైబ్రిడ్ విధానంలో నిర్వహణ
వాస్తవానికి ఈసారి మహానాడును నెల్లూరులో అత్యంత ఘనంగా మూడు రోజుల పాటు నిర్వహించాలని పార్టీ భావించింది. అయితే, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు స్పందించి, ఈసారి హైబ్రిడ్ విధానంలో మహానాడును రెండు రోజులు నిర్వహించాలని నిర్ణయించినట్లు లోకేశ్ వివరించారు. దీని ప్రకారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ప్రధాన కార్యక్రమంలో పొలిట్బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొంటారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్ కేంద్రాల్లో వర్చువల్గా మహానాడు కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ప్రతి క్లస్టర్ కేంద్రంలో ఎల్ఈడీ టీవీ, స్పీకర్లు వంటి సాంకేతిక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
క్లస్టర్ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం
ఈ మహానాడును క్లస్టర్ వ్యవస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకోవాలని లోకేశ్ అన్నారు. “క్లస్టర్ ఇంఛార్జ్లకు ఎక్కువ బాధ్యత ఇవ్వాలన్నది పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశం. ఈ వ్యవస్థ ద్వారానే మనం ముందుకు వెళ్లాలి” అని ఆయన పేర్కొన్నారు. క్లస్టర్ పరిధిలోని కుటుంబ సాధికార సారథి (కేఎస్ఎస్) నుంచి బూత్ ఇంఛార్జ్లు, గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాల సభ్యుల వరకు అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. హాజరును ‘మై టీడీపీ’ యాప్ ద్వారా నమోదు చేయనున్నట్లు తెలిపారు.
స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి
ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో, త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని లోకేశ్ గుర్తుచేశారు. ఇందుకు మహానాడును ఒక వేదికగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీలో వ్యక్తులు శాశ్వతం కాదని, వ్యవస్థే శాశ్వతమని, ఆ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకే క్లస్టర్ ఇంఛార్జ్లకు అవకాశం కల్పించామని అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తున్నామని, వారి పనితీరును ‘మై టీడీపీ’ యాప్ ద్వారా గుర్తిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్లతో సమన్వయం చేసుకుంటూ, ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి మహానాడును చారిత్రాత్మక విజయంగా నిలపాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్లు, జోనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.