CBN : రాష్ట్రస్థాయి ప్రక్షాళనకు కుప్పం నుంచే శ్రీకారం – చంద్రబాబు
పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించే వారిని ఉపేక్షించిలేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు అలాంటి వారిని పక్కనపెట్టి రాబోయే ఆరునెలల్లో కొత్తరక్తంతో పార్టీకి నూతన జవసత్వాలు తీసుకువస్తామని తెలిపారు.
- By Hashtag U Published Date - 02:08 PM, Thu - 9 December 21
పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించే వారిని ఉపేక్షించిలేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు అలాంటి వారిని పక్కనపెట్టి రాబోయే ఆరునెలల్లో కొత్తరక్తంతో పార్టీకి నూతన జవసత్వాలు తీసుకువస్తామని తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కుప్పం మున్సిపల్ అభ్యర్థులు, పార్టీ నేతలతో బుధవారం చంద్రబాబునాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీలో ప్రక్షాళన కార్యక్రమాన్ని కుప్పం నుంచే ప్రారంభిస్తామని తెలిపారు. ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ పార్టీని సమర్థవంతంగా నడిపేంచేందుకు వీలుగా సమర్థులైన నేతలతో కోఆర్డినేషన్ కమిటీని నియమిస్తామని ఆయన నాయకులకు తెలిపారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 350 ఓట్ల తేడాతో ఏడువార్డుల్లో ఓడిపోయామని…. కుప్పం మున్సిపాలిటీలోని 25వార్డుల్లో పోటీచేసిన అభ్యర్థులు ఎన్నికల్లో తాము ఎదుర్కొన్న అంతర్గత, బహిర్గత సమస్యలపై రహస్య నివేదికలు తయారుచేసి తమకు పంపినట్లయితే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తానని చంద్రబాబు తెలిపారు.
తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనివిధంగా ప్రత్యర్థులు నీచ రాజకీయాలకు దిగారని…ఈ పరిస్థితుల్లో దీటుగా ఎదుర్కొనే సమర్థ నాయకత్వం అవసరమని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. కొన్నిచోట్ల అభ్యర్థులను చివరినిమిషంలో ఎంపికచేయడం కూడా కొంత నష్టం కలిగించిందని… అయితే తాను ఇప్పటివరకు చేసిన సమీక్షల్లో నిత్యం ప్రజలవద్దకు వెళ్తూ క్షేత్రస్థాయిలో పనిచేస్తూ వచ్చినచోట్ల మంచి ఫలితాలు వచ్చాయని గుర్తించినట్లు తెలిపారు. ఒకచోట బేలుదారి మేస్త్రి, మరొక చోట లిఫ్ట్ ఆపరేటర్, ఇంకొక చోట పెయింటర్, బడ్డీకొట్టు చిరువ్యాపారి విజయం సాధించారని… ఇటువంటి వారి విజయాలు కేస్ స్టడీగా తీసుకొని ముందుకు సాగాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఇకపై పార్టీని సమర్థవంతగా ముందుకు నడిపించే వారికి మాత్రమే పట్టం కడతామని..రకరకాల మొహమాటాలు, లాలూచీ వ్యవహారాలతో ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యే వారికి స్థానం ఉండబోదని చంద్రబాబు నాయకులకు తెల్చి చెప్పారు. కొందరు క్షేత్రస్థాయిలో పనిచేయడం మాని…తమ వద్దకు ఏవేవో చెబుతూ తనను మెప్పించడానికి ప్రయత్నిస్తున్నారని…ఇకపై అటువంటి వారి పప్పులేమీ ఉడకబోవని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల రోజు దొంగఓటర్లను అడ్డుకునేందుకు కుప్పంలో మహిళలు చూపిన చొరవ, పోరాట పటిమను చంద్రబాబునాయుడు కొనియాడారు. రాజకీయ ప్రత్యర్థులు ఇప్పటివరకు తమను ఒకవైపే చూశారని… అధికారంలోకి రాగానే రాజకీయ నేరగాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తామని తెలిపారు. బాంబులకు, క్లేమోర్ మైన్లకు భయపడని తాను…ముఠానాయకులకు భయపడేది లేదన్నారు.
కుప్పంలో స్థానిక నాయకుల అతి విశ్వాసంతోపాటు ప్రత్యర్థుల తప్పుడు ప్రచారం, దొంగఓట్లు, పోలీసులతో బలప్రయోగం, ప్రలోభాలు ఓటమికి ప్రధాన కారణాలుగా విశ్లేషించారు. అధికార పార్టీ అరాచకాలపై ఐకమత్యంగా పోరాడతామని చంద్రబాబునాయుడు పార్టీ కేడర్ కు పిలుపునిచ్చారు. కుప్పంలో ఇల్లు నిర్మించుకొని కనీసం ప్రతి మూడునెలలకు ఒకసారి రావాల్సిందిగా ఎస్ ఆర్ బాలకుమార్ అనే స్థానిక నేత చేసిన విజ్జప్తిపై చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందిస్తూ…ఈ అంశాన్ని పరిశీలిస్తానని అన్నారు.
Related News
Chandrababu : చంద్రబాబు ఫారిన్ టూర్.. వారం పాటు అమెరికా పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలిసి వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు.