CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!
- Author : Vamsi Chowdary Korata
Date : 09-05-2026 - 4:53 IST
Published By : Hashtagu Telugu Desk
టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. దళపతి విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సాధారణ మెజార్టీ లేకపోవడంతో సర్కారు ఏర్పాటు విషయంలో ఇబ్బందులు పడుతోంది. కాంగ్రెస్, వామపక్షాలు సహా చిన్న పార్టీల మద్దతు ఇచ్చాయని మూడుసార్లు గవర్నర్ను కలిశారు. అయితే, ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు వీసీకే చుట్టూ తిరుగుతున్నాయి. అయితే, టీవీకే తమ మద్దతు వీసీకే ప్రకటించింది.
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలో విజయ్కు మద్దతు ఇవ్వడంపై వీసీకే కీలక నిర్ణయం తీసుకుంది. బేషరతుగా మద్దతు ఇవ్వడానికి ఆ పార్టీ అంగీకరించడంతో నెంబర్ గేమ్కు తెరపడిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇద్దరు వీసీకే ఎమ్మెల్యేల మద్దతుతో 118 ‘మ్యాజిక్ నంబర్’ను చేరుకుని విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. దీనిపై ప్రకటన చేసిన వీసీకే.. తమ మద్దతు లేఖను టీవీకే ప్రధాన కార్యదర్శి అదవ అర్జునకు అందజేసింది. అంతకు ముందు టీవీకేతో పొత్తుపై నిర్ణయం తీసుకునే అధికారం అధినేతకు వీసీకే కార్యనిర్వాహక కమిటీ అప్పగించింది. ప్రస్తుతం టీవీకేకు 107 మంది, కాంగ్రెస్ 5, సీపీఎం 2, సీపీఐ 2, వీసీకే 2 కలిపి మొత్తం 118కి చేరుకుంది.
వీసీకే మద్దతు కోసం ఎదురుచూస్తోన్న టీవీకే అధినేత… నీలాంగరై నివాసం నుంచి లోక్భవన్ సమీపంలోని వట్టినాపాకం ఇంటికి చేరుకున్నారు. వీసీకే మద్దతు ప్రకటించిన వెంటనే.. గవర్నర్ను కలిసేందుకు వీలుగా ఆయన నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు, వీసీకే చీఫ్ తొల్ తిరుమావళవన్ను విజయ్ కలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా తనకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరే అవకాశం ఉంది. అయితే, ఈ అంశంపై శనివారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటుచేసి వివరాలను వెల్లడిస్తామని వీసీకే నేతలు ప్రకటించారు. అయితే, టీవీకే ప్రధాన కార్యదర్శి అదవ అర్జున్.. మరోసారి గవర్నర్ను కలుస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఇదిలా ఉండగా, టీవీకే అధినేత, నటుడు విజయ్ ఇప్పటికే తమిళనాడు ఇంఛార్జ్ గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ను మూడుసార్లు కలిసి, తనకు మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అయితే, గవర్నర్ మాత్రం 118 మంది ఎమ్మెల్యేలతో కూడిన లేఖను చూపించాలని కోరారు. విజయ్ విఫలం కావడంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించలేదని లోక్భవన్ వర్గాలు తెలిపాయి. విజయ్కు మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి ఐయూఎంఎల్, ఏఎంఎంకేలు యూటర్న్ తీసుకున్నాయి.
బుధవారం, గురువారం కూడా గవర్నర్తో విజయ్ సమావేశమయ్యారు. ఆ రెండుసార్లూ, అవసరమైన మద్దతు లేదని వాదిస్తూ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న విజయ్ వాదనను అర్లేకర్ తోసిపుచ్చారు. అయితే, దళపతి విజయ్ వరుసగా గవర్నర్ను కలుస్తుండటంపై డీఎంకే విమర్శలు గుప్పించింది. గవర్నర్ను కలవడానికి ముందే వేరే పార్టీల మద్దతును కూడగట్టుకోవాలని డీఎంకే సూచించింది. అవసరమైన సంఖ్యాబలం లేకుండా గవర్నర్కు లేఖ ఎందుకు ఇవ్వడమని ప్రశ్నించింది.