CBN: రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్!
- Author : Vamsi Chowdary Korata
Date : 08-05-2026 - 1:58 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఏపీలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. తిరుపతి జిల్లాలో సుమారు రూ. 2,200 కోట్ల వ్యయంతో మోటార్సైకిళ్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం ఈ ప్రాజెక్టును ఆమోదముద్ర వేసింది.
Royal Enfield is cruising its way into Rayalaseema! pic.twitter.com/sEQsvW5Zyk
— N Chandrababu Naidu (@ncbn) May 8, 2026
ఈ శుభవార్తను సీఎం చంద్రబాబు తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. “రాయల్ ఎన్ఫీల్డ్ రాయలసీమలోకి దూసుకుపోతోంది! రాయలసీమ ఇప్పుడు రాయల్ సీమ” అనే క్యాప్షన్తో ఓ బుల్లెట్ బైక్ ఫొటోను ఆయన పంచుకున్నారు. ఈ ట్వీట్ కొద్దిసేపట్లోనే వైరల్గా మారింది.
తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని వన్నెలూరు, రాళ్ళకుప్పం గ్రామాల్లో ఈ పరిశ్రమ కోసం ప్రభుత్వం 267 ఎకరాల భూమిని కేటాయించింది. రెండు దశల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొదటి దశను 2029 నాటికి, రెండో దశను 2032 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.