Rahul Gandhi: ఏపీకి ప్రత్యేక హోదా నా బాధ్యత.. రాజధాని అమరావతే!
కాంగ్రెస్ జనగర్జనలో గర్జించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధికార పార్టీ బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీంగా వ్యహరిస్తూ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుందని మండిపడ్డారు.
- Author : Praveen Aluthuru
Date : 03-07-2023 - 7:46 IST
Published By : Hashtagu Telugu Desk
Rahul Gandhi: కాంగ్రెస్ జనగర్జనలో గర్జించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధికార పార్టీ బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీంగా వ్యహరిస్తూ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ మోడీ బంధువు అని, మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కేసీఆర్ మద్దతు ఇస్తాడని రాహుల్ చెప్పారు. ఇక ఈ సభ ద్వారా రాహుల్ గాంధీ సెన్సేషన్ నిర్ణయం తీసుకున్నారు, వృద్దులకు, వితంతువులకు 4000 పెన్షన్ ఇస్తానని ప్రకటించారు. దీంతో జనగర్జన సభ దద్దరిల్లింది. రాహుల్ ప్రకటనపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. మరీ ముఖ్యంగా వృద్దులు, వితంతువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జనగర్జన సభ అనంతరం రాహుల్ రోడ్డుమార్గాన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే విమానాశ్రయంలో వేచి ఉన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో ముచ్చటించారు. వారితో దాదాపు అరగంటసేపు మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రాకి ప్రత్యేక హోదా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. విభజన హామీలో ఉన్న అన్నీటిని అమలు చేస్తామని చెప్పారు. ఇక రాష్ట్రానికి రాజధాని లేకపోవడమే బాధాకరమన్నారు రాహుల్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
రాజధానికి భూములిచ్చిన రైతుల పరిస్థితి గురించి రాహుల్ ప్రస్తావించారు. ఆ రైతులని సీఎం జగన్ ఎలా మోసం చేస్తున్నాడో తనకు తెలుసునని చెప్పాడు. ఇక విశాఖ ఉక్కు కర్మాగారం ప్రవేటీకరణపై రాహుల్ మండిపడ్డారు. నెలలోపు విశాఖకు వస్తానని, ప్రవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడే వారికోసం సంఘీభావంగా విశాఖ సభలో పాల్గొంటానని తెలిపారు. అలాగే ప్రభుత్వరంగ సంస్థలను ప్రవేటీకరణ చేయడం కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమని చెప్పాడు రాహుల్ గాంధీ. ఇక ఇదే సందర్భంగా సీఎం జగన్ కేసులపై ఆరా తీశారు. టీడీపీ, జనసేన పార్టీల గురించి ఏపీ నేతలు రాహుల్ కు వివరించారు. మొత్తానికి త్వరలోనే ప్రియాంక గాంధీ ఏపీలో పర్యటిస్తున్నట్టు స్పష్టం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
Read More: Praful Patel-Fadnavis-Modi : మోడీ క్యాబినెట్ లోకి ప్రఫుల్ పటేల్, ఫడ్నవీస్ ?