Pawan Kalyan: కాక్రోచ్ పార్టీ పై పవన్ కల్యాణ్ కామెంట్స్
- Author : Vamsi Chowdary Korata
Date : 15-06-2026 - 3:40 IST
Published By : Hashtagu Telugu Desk
దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో తీవ్ర చర్చనీయాంశమైన అంశం.. కాక్రోచ్ జనతా పార్టీ. అవినీతి, నిరుద్యోగం, విద్యావ్యవస్థలోని లోపాలను నిరసిస్తూ సోషల్ మీడియాలో యువత ద్వారా పుట్టుకొచ్చిన ఉద్యమం ఇది. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఇప్పటికే దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కాక్రోచ్ జనతా పార్టీపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం ఢిల్లీలో జనసేన పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. కాక్రోచ్ జనతా పార్టీపై స్పందించారు.
సుమతీ శతకంలో చెప్పినట్లు బలమైన సర్పం కూడా చలిచీమల చేతిలో చిక్కి చనిపోతుంది. స్థాయి లేదు, చిన్న మనుషులే అనుకుంటాం. ప్రతి ఒక్కరి గురించి ఏదైనా మాట్లాడవచ్చని అనుకుంటాం. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. కాక్రోచ్ అనే పార్టీ పుట్టుకొచ్చింది. నాకు సుమతీ శతకం గుర్తొచ్చింది. చాలా చిన్న ప్రాణులైన చీమలు కూడా బలమైన పామును చంపేస్తాయి. దేశ సమగ్రతను బలి చేసేందుకు శక్తులు సిద్ధంగా ఉన్నాయి. అలాంటి ఆలోచనా ధోరణిలో మనం చిక్కుకోకూడదనే ఉద్దేశంతో ఢిల్లీలో సమావేశమయ్యాం. కోట్ల మంది వ్యక్తులు కలిస్తే చాలా బలమైన ప్రభావాన్ని చూపించవచ్చు. అది మంచిదైనా, చెడైనా.. విభజనవాదాన్ని సృష్టిస్తున్న పరిస్థితులలో మనం అందులో భాగస్వాములు కాకూడదు. ఎదురుతిరిగి పోరాడాలి. ఐక్యంగా పోరాడాలి” అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
మరోవైపు 12 ఏళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించిన సమయంలో దేశ శ్రేయస్సు, సమగ్రత తప్ప వేరే ఆలోచన లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారంలోకి వస్తామో లేదో అనే ఆలోచన కూడా లేదన్నారు. 12 ఏళ్ల ప్రయాణంలో అనేక పోరాటాలు, పరాజయాలు చవిచూశామన్నారు. ప్రాథమిక సూత్రాలకు అనుగుణంగా పార్టీని నడుపుతూ 21 మంది ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాలను సాధించామని వెల్లడించారు. లక్ష మంది సభ్యులతో ప్రారంభమైన జనసేన పార్టీకి నేడు 20 లక్షలకు పైగా సభ్యత్వాలు వచ్చాయన్నారు. ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలోకి అన్ని ప్రాంతాల నుంచి చేరికలు జరుగుతున్నాయని వివరించారు.
ఈ క్రమంలోనే తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ మరోసారి ప్రస్తావించారు. జనసేన పార్టీ తెలంగాణ ఏర్పాటును ఎప్పుడూ అడ్డుకోలేదన్న పవన్.. ఏపీని విభజించిన తీరుపైనే ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ తీరు అశాంతిని సృష్టించిందన్న ఆయన.. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ తన ధోరణి మార్చుకోలేదన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్లో తన సభను అడ్డుకోవడమే అందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.