Byreddy Shabari: వైసీపీ నేతలపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఫైర్
- Author : Vamsi Chowdary Korata
Date : 15-05-2026 - 1:47 IST
Published By : Hashtagu Telugu Desk
కర్నూలులో నిన్న వైసీపీ నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొన్న వారిలో సగం మందికి పైగా గంజాయి బ్యాచ్, క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారేనని బైరెడ్డి శబరి ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కేవలం ‘స్క్రాప్’ మనుషులతో మాట్లాడిస్తున్నారని, చిల్లర ఇష్యూలను పట్టుకొని అలజడులు సృష్టించడం వైసీపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ముఖ్యంగా అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దోచుకునే ‘బాలు’ వంటి వ్యక్తుల కోసం వైసీపీ నాయకులు రోడ్లపైకి రావడం సిగ్గుచేటని విమర్శించారు.
ముచ్చుమర్రిలో మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటనను ప్రస్తావిస్తూ, ఆ దారుణానికి ఒడిగట్టిన వారు వైసీపీ కార్యకర్తలేనని ఆమె సంచలన ఆరోపణ చేశారు. బాలిక శవం కోసం ఐదు రోజుల పాటు గాలిస్తుంటే కనపడని వైసీపీ నేతలు, ఇప్పుడు నిందితులను పరామర్శిస్తూ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు మనుషులు కాదు, రాక్షసులంటూ ఆమె విరుచుకుపడ్డారు.
రాయలసీమ అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని, వైసీపీ నేతలకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని బైరెడ్డి శబరి సవాల్ విసిరారు. అక్రమాలకు పాల్పడే వారు ఎవరైనా, చివరికి టీడీపీ వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలాగే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, కష్టపడి వ్యాపారాలు చేసుకోవడం తప్పా అని ప్రశ్నించారు.