కడపలో అల్లర్ల వెనుక వైసీపీ స్కెచ్…. కూటమి సర్కార్పై కుట్ర…!!
- Author : Vamsi Chowdary Korata
Date : 13-05-2026 - 12:31 IST
Published By : Hashtagu Telugu Desk
కడపలో అకస్మాత్తుగా చెలరేగిన అల్లర్ల వెనుక వైసీపీ నాయకుల పక్కా ప్రణాళిక ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అల్మాస్పేట సర్కిల్ పేరు మార్పు అంశాన్ని సాకుగా చూపి, స్థానిక యువతను రెచ్చగొట్టి వీధుల్లోకి తెచ్చారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు నోరు మెదపని వైసపీ నేతలు, ఇప్పుడు కావాలనే తప్పుడు ప్రచారంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అశాంతికి తెరలేపారు.
ఈ హింసాకాండలో పాల్గొన్న వారంతా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రధాన అనుచరులని సీసీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. వైసీపీ నాయకులు సయ్యద్ అహ్మద్ బాషా, జకీర్ హుస్సేన్తో పాటు సుమారు 50-60 మంది యువకులను సమీకరించి, పోలీసులపై రాళ్ల దాడికి ఉసిగొల్పినట్లు నిర్ధారణ అయ్యింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, రాజకీయంగా లబ్ధి పొందడమే లక్ష్యంగా ఈ పొలిటికల్ గేమ్ నడిపించినట్లు స్పష్టమవుతోంది.
వైసీపీ నాయకులు తమ ఉనికిని చాటుకోవడానికి గంజాయి బ్యాచ్లను, అమాయక యువతను పావులుగా వాడుకున్నారు. పోలీసులపై దాడి చేసి, నగరంలో భయోత్పాతాన్ని సృష్టించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూశారు. ఇప్పటికే కొందరు నిందితులు విదేశాలకు పారిపోగా, మరికొందరు వైసీపీ నేతల అండతో పరారీలో ఉన్నారు. ఈ కుట్ర వెనుక ఉన్న పెద్ద తలకాయల కోసం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
మత సామరస్యానికి ప్రతీకగా ఉండే కడపలో వైసీపీ సాగించిన ఈ హింసాత్మక ప్రయోగం ఇప్పుడు ఆ పార్టీకే బూమరాంగ్ అవుతోంది. ప్రజలను తప్పుదోవ పట్టించి అల్లర్లకు ప్రేరేపించిన వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అల్లర్ల వెనుక ఉన్న అసలు సూత్రధారులు బయటపడితే వైకాపా అగ్రనేతలకు చిక్కులు తప్పేలా లేవు.