టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి గుడ్ బై..
- Author : Vamsi Chowdary Korata
Date : 09-01-2026 - 4:22 IST
Published By : Hashtagu Telugu Desk
Janga Krishna Murthy Resigned టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. బాలాజీ నగర్ ప్లాట్ కేటాయింపు విషయంలో తనపై వస్తున్న ఆరోపణలు.. మీడియా కథనాలు తప్పు అని కొట్టిపారేశారు. పత్రికల్లో వస్తున్న తప్పుడు కథనాలు, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మనస్తాపం చెంది రాజీనామా సమర్పిస్తున్నట్లు సీఎంకు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయం బాధాకరమని జంగా కృష్ణమూర్తి తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యత్వం నుంచి వైదొలుగుతూ జంగా కృష్ణమూర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే తన రాజీనామా లేఖను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు. గత కొన్నిరోజులుగా తనపై వస్తున్న ఆరోపణలు.. మీడియాల్లో వస్తున్న కథనాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో జంగా కృష్ణమూర్తి వెల్లడించారు. గత 2 రోజులుగా కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవాలు అని.. అవి చూసి తాను తీవ్ర మనోవేదనకు గురైనట్లు ఆ లేఖలో జంగా కృష్ణమూర్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సదరు పత్రికలు కనీసం తనను సంప్రదించకుండానే ఏకపక్షంగా వార్తలు రాయడం బాధాకరమని జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఆ పత్రిక తన వ్యక్తిత్వ హననానికి పాల్పడిందని తీవ్రంగా విమర్శించారు. పవిత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని అపవిత్ర పనులకు పాల్పడుతున్నానని.. తనపై అసత్య ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
బాలాజీ నగర్ ప్లాట్ వివాదంపై వివరణ
గతంలో తనకు కేటాయించిన బాలాజీ నగర్ ప్లాట్ నంబర్ 2 (ప్రస్తుతం ఖాళీగా ఉంది)ను రీ అలాట్మెంట్ చేయవలసిందిగా సీఎం చంద్రబాబును కోరినట్లు జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. దాన్ని ముఖ్యమంత్రి టీటీడీ బోర్డు నిర్ణయానికి పంపించగా.. ఆ తర్వాత బోర్డు తీర్మానం చేసి తిరిగి ప్రభుత్వానికి పంపిందని వివరించారు.
ప్రభుత్వ నిర్ణయంపై విచారం
ఇక నిన్న (గురువారం) జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో వాస్తవాలు తెలుసుకోకుండానే టీటీడీ బోర్డు నిర్ణయాన్ని రద్దు చేస్తామని సీఎం ప్రకటించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. తనకు శ్రీవారి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో టీటీడీ బోర్డు సభ్యుడి పదవిలో ఉండలేనని.. అందులో నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ స్వామి వారికి సేవ చేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నందుకు ఆ భగవంతుని క్షమించమని కోరుకుంటున్నానంటూ జంగా కృష్ణమూర్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.