AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!
- By Vamsi Chowdary Korata Published Date - 11:14 AM, Tue - 2 December 25
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై నమోదైన మద్యం విధానం అవినీతి కేసును ఏసీబీ కోర్టు మూసివేసింది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా కేసును పరిగణించి క్లోజ్ చేసింది. ఈ మేరకు ఏసీబీ వాదనతో ఫిర్యాదుదారుడు ఏకీభవించారు. అనంతరం నిరభ్యంతర పత్రం దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, పలు మద్యం కంపెనీలు, సరఫరాదారులకు అనుకూల నిర్ణయాలు తీసుకుని.. వారికి అనుచిత లబ్ధి చేకూర్చారనే ఆరోపణలపై 2023లో చంద్రబాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో చంద్రబాబును ఏ3 నిందితుడిగా చేర్చారు.
గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబుపై అవినీతి కేసు నమోదైన సంగతి తెలిసిందే. 2014-19 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమలు చేసిన మద్యం విధానంలో అవినీతి జరిగిందంటూ ఆయనపై నమోదైంది. పలు మద్యం కంపెనీలు, సరఫరాదారులకు అనుకూల నిర్ణయాలు తీసుకుని వారికి అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి ఏపీఎస్బీసీఎల్ ఎండీ డి వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2023 అక్టోబరు 28న సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసు నుంచి సీఎం చంద్రబాబుకు విముక్తి లభించింది. విజయవాడలోని అవినీతి నిరోధక సంస్థ (ఏసీబీ) కోర్టు సోమవారం ఈ కేసును కొట్టివేసింది. కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ (వాస్తవానికి విరుద్ధం)గా తేల్చిన సీఐడీ వాదనలతో కోర్టు ఏకీభవించి కేసును క్లోజ్ చేసింది.
ఈ కేసు అభియోగపత్రంలో అప్పటి ఎక్సైజ్ కమిషనర్ శ్రీనివాస శ్రీనరేష్ను ఏ1గా, అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రను ఏ2గా, చంద్రబాబను ఏ3గా పేర్కొన్నారు. నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన బ్రేవరేజ్తో పాటు మరొక బ్రేవరేజ్కి.. 3 డిస్టిలరీలకి లబ్ధి చేకూర్చేలా టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా విధానంలో మార్పులు చేసినట్లు గుర్తించామని అప్పట్లో ఎఫ్ఐఆర్లో సీఐడీ పేర్కొంది. ఈ 5 మద్యం సంస్థలకు అనుకూలంగా 2012 ఎక్సైజ్ పాలసీని మార్చి, అనుమతులు ఇచ్చినట్లు ఆరోపించింది. కానీ ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా పేర్కొనడం గమనార్హం.
ఈ విషయంపై దర్యాప్తు చేసిన అధికారులు.. ఇటీవల ఈ కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ (వాస్తవానికి విరుద్ధం)గా పేర్కొంటూ కోర్టులో క్లోజర్ రిపోర్టు దాఖలు చేశారు. అనంతరం కోర్టు ఫిర్యాదుదారుడు అప్పటి ఏపీఎస్బీసీఎల్ ఎండీ డి వాసుదేవరెడ్డికి నోటీసులు జారీ చేసింది. సీఐడీ వాదనతో ఏకీభవించిన వాసుదేవరెడ్డి.. 16 రోజుల క్రితం కేసును ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టులో నిరభ్యంతర పత్రం దాఖలు చేశారు. ఇక ప్రస్తుత ఏపీఎస్బీసీఎల్ ఎండీ సీహెచ్ శ్రీధర్ కూడా కేసు ఉపసంహరణకు అభ్యంతరం లేదని అఫిడవిట్ ఇచ్చారు. దీంతో కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా పరిగణించి మూసేస్తున్నట్లు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదే కాకుండా గత ప్రభుత్వంలో చంద్రబాబుపై ఫైబర్నెట్ కుభకోణం కేసు కూడా నమోదైంది. ఈ కేసును ఇటీవల ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది. ఫైబర్నెట్లో అక్రమాలేవీ జరగలేదని.. సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని సీఐడీ క్లీన్చిట్ ఇచ్చిన నేపథ్యంలో కోర్టు కేసును మూసివేసింది. ఫైబర్నెట్ పూర్వ మేనేజింగ్ డైరెక్టర్ ఎం మధుసూదనరెడ్డి, ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ గీతాంజలి శర్మ.. కోర్టుకు లిఖితపూర్వకంగా తెలియజేసిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.