AP Electricity Charges: ఏపీ ప్రజలకు శుభవార్త.. భారీగా తగ్గనున్న కరెంట్ ఛార్జీలు
- Author : Vamsi Chowdary Korata
Date : 15-07-2026 - 11:19 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు త్వరలోనే భారీ ఊరట లభించనుంది. గతేడాది విద్యుత్ ఛార్జీల్లో యూనిట్కు 13 పైసల మేర తగ్గించిన కూటమి ప్రభుత్వం, ఈసారి కూడా అదే స్థాయిలో (మరో 13 పైసలు) తగ్గించేందుకు ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కామ్లు) తమ అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవడం, విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవడం ద్వారా ఈ సానుకూల ఫలితాలు సాధించాయి. గత ప్రభుత్వ హయాంలో ట్రూ-అప్ మరియు అదనపు సర్ఛార్జీల భారంతో సతమతమైన సామాన్య వినియోగదారులపై సరికొత్త భారం పడకుండా, వరుసగా రెండో ఏడాది కూడా ‘ట్రూ డౌన్’ విప్లవంతో విద్యుత్ బిల్లులు తగ్గనుండటం గమనార్హం.
2025-26 ఆర్థిక సంవత్సరానికి (Financial Year) సంబంధించి ఏపీలోని మూడు డిస్కామ్లు (APEPDCL, APCPDCL, APSPDCL) తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదికను (ARR) ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి (APERC) సమర్పించాయి. ఇందులో ఇంధన సర్దుబాటు ఖర్చులకు సంబంధించి ఏకంగా రూ. 940.07 కోట్ల మిగులును (Surplus) డిస్కామ్లు చూపించాయి. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం ఈఆర్సీ (ERC) త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించనుంది. ప్రజలు, వినియోగదారుల నుంచి వచ్చే సలహాలు, వినతులను స్వీకరించిన తర్వాత ఈ విద్యుత్ ఛార్జీల తగ్గింపు ప్రతిపాదనకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.