Tummala Nageswara Rao: ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి: మంత్రి తుమ్మల
- Author : Vamsi Chowdary Korata
Date : 15-07-2026 - 12:44 IST
Published By : Hashtagu Telugu Desk
ఎల్నినో ప్రభావంతో రైతన్నలు కొంత నష్టపోతున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అనుకున్న సమయానికి వర్షాలు లేకపోవడం వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. దానికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల వైపు వెళ్తే బాగుటుందని సూచించారు.
రేపటి నుంచి ఆగస్టు రెండో వారంలోగా ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు. ఆయా జిల్లాల వారీగా వివరాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఈ పంటల కోసం అన్నదాతలకు తమ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాన్ని ఇంకా నిర్ణయించలేదని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే తమ కర్తవ్యమని తెలిపారు. కంది, సొయాబీన్, పెసర, మినుము, జొన్న, సజ్జ సాగుకు రైతులు సిద్ధపడాలని సూచించారు.
వర్షాల మీద ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం సరికాదని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు, ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వర్షపాతం తగ్గుతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది.