Collectors Meeting : సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులు కలెక్టర్ల సదస్సు ..!
రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
- By Latha Suma Published Date - 06:13 PM, Tue - 10 December 24

Collectors Meeting : లగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధ, గురువారాల్లో కలెక్టర్ల సమావేశం జరగనుంది. 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులతో జరిగే ఈ సదస్సులో వారి అభిప్రాయాలను సీఎం తెలుసుకోనున్నారు. అంతేకాక.. ఈ సదస్సులో గడిచిన ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలు, వంటి అంశాలపై సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్ధేశం చేయనున్నారు. రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
సమావేశం మొదటి రోజున ఆర్టీజీఎస్, వినతుల పరిష్కారం, గ్రామ-వార్డు సచివాలయాలు, వాట్సాప్ గవర్నెన్స్, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్పై చర్చిస్తారు. మధ్యాహ్నం నుంచి వ్యవసాయం, పశుసంవర్ధక, హార్టీకల్చర్, పౌర సరఫరాలు, అడవులు, జలవనరులు, పంచాయతీరాజ్, నరేగా, రూరల్ వాటర్ సప్లై, సెర్ప్, పట్టణాభివృద్ధి, సీఆర్డీయే, శాంతి భద్రతలు వంటి అంశాలపై కాన్ఫరెన్స్లో చర్చిస్తారు. రెండో రోజు పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, విద్యుత్, మానవవనరులు, ట్రాన్స్ పోర్ట్, రోడ్లు-భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం, రెవిన్యూ, ఎక్సైజ్, మైన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ వంటి వివిధ అంశాలపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చిస్తారని సమాచారం. ఇక ఈ సమావేశంలో మంత్రులు, ఐపీఎస్ అధికారులు పాల్గొంటారు. కాగా, గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం ఒకే ఒకసారి మాత్రమే కలెక్టర్లతో సమావేశం నిర్వహించగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఆరు నెలల్లోనే రెండవ సారి సమావేశం నిర్వహిస్తోంది.