CM Chandrababu : భారీ వర్షాలు..సింగ్ నగర్లో సీఎం చంద్రబాబు పర్యటన
ఇలాంటి విపత్తును విజయవాడలో ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. బోటులో వెళ్లి సింగ్ నగర్, తదితర వరద ప్రాంతాలపు పరిశీలించారు. భద్రతా సిబ్బంది వద్దంటున్నా వినకుండా సీఎం బోటులో వెళ్లి సహయక చర్యలను పర్యవేక్షించారు.
- By Latha Suma Published Date - 05:55 PM, Sun - 1 September 24

CM Chandrababu : ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ కర్తవ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇలాంటి విపత్తును విజయవాడలో ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. బోటులో వెళ్లి సింగ్ నగర్, తదితర వరద ప్రాంతాలపు పరిశీలించారు. భద్రతా సిబ్బంది వద్దంటున్నా వినకుండా సీఎం బోటులో వెళ్లి సహయక చర్యలను పర్యవేక్షించారు. బాధితుల ఇబ్బందులను దగ్గరుండి చూశా. వరద నీరు తగ్గే వరకు పరిస్థితిని పర్యవేక్షిస్తా. బాధితుకు వెంటనే ఆహారం, తాగునీరు అందిస్తాం.. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మీకు దగ్గర్లోనే ఉంటా అన్ని చంద్రబాబు వరద బాధితులకు భరోసా ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
పర్యటనకు ముందు సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాజా టోల్గేట్, జగ్గయ్యపేటలో ముంపు ఎక్కువగా ఉందన్నారు. విజయవాడ, గుంటూరులో 37 సెంటీమీటర్ల వర్షం కురవడం అసాధారణమని, అందుకే ముంపు ప్రాంతాల సంఖ్య పెరిగిందని చెప్పారు. గుంటూరు, విజయవాడలో సహాయక చర్యలు చేపట్టామన్నారు.
”అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం. వర్షాలు, వరదల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు గల్లంతయ్యారు. కొండచరియలు పడటం, కారులో చనిపోవడం, వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు చనిపోవడం బాధాకరం. పులిచింతల నుంచి ప్రవాహం ఎక్కువగా వస్తోంది. ప్రకాశం బ్యారేజీకి 8.8 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. బుడమేరు వల్ల వీటీపీఎస్లో విద్యుదుత్పత్తి ఆగింది. ప్రకాశం బ్యారేజీ కింద పలు చోట్ల గట్లు బలహీనంగా ఉన్నాయి. గట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలు వేస్తున్నాం.
Read Also: Telangana Rains : తెలంగాణకు తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్న కేంద్రం
వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 107 క్యాంపులు పెట్టాం.. 17 వేల మందిని తరలించాం. ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. వరదముంపు ప్రాంతాలకు బోట్లు పంపించాం. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎక్కడిక్కడ ఏర్పాట్లు చేశాం. భవిష్యత్లో ఇలాంటి విపత్తులు రాకుండా చర్యలు చేపడతాం. ప్రజల ప్రాణాలు కాపాడటమే మా తక్షణ కర్తవ్యం. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా సత్వర చర్యలు చేపడుతున్నాం. వరద ప్రాంతాల్లో బియ్యం, పప్పు, నూనె, పంచదార, కూరగాయలు పంపిణీ చేస్తున్నాం. మత్స్యకారుల కుటుంబానికి 50 కిలోల బియ్యం ఇస్తున్నాం. సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాం. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. పంటలు నష్టపోయిన వారికి పరిహారం అందిస్తాం..అని సీఎం అన్నారు.
కాగా, గుడ్లవల్లేరు కళాశాల ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఆడపిల్లల రక్షణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రమంతా ఏదో జరిగిపోతోందని ప్రచారం చేయడం దారుణం. ఆడబిడ్డలపై దుష్ప్రచారం చేయడం మంచిదికాదు. దిల్లీ సాంకేతిక నిపుణుల సాయం తీసుకుంటున్నాం. అనుమానం ఉన్నవారిని ఫోన్లు, కంప్యూటర్లు తనిఖీ చేస్తాం. గుడ్లవల్లేరు ఘటనపై ఆధారాలుంటే పోలీసులకు ఇవ్వాలి” అని చంద్రబాబు అన్నారు.