CM Chandrababu In Delhi: కేజ్రీ నీ గొప్పలు బంద్ జేయ్.. కేజ్రీవాల్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని భారత్లో భారీ పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారని చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు.
- By Kode Mohan Sai Published Date - 01:18 PM, Mon - 3 February 25

CM Chandrababu In Delhi: భారత్ దేశ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఢిల్లీ వేదికగా అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏఐ సాంకేతికతలో భారత్ (India) ముందు వరుసలో ఉందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మారుమోగుతోందని తెలిపారు. ఫుడ్ సెక్యూరిటీకి గ్లోబల్ హబ్ గా భారత్ మారబోతోందని వెల్లడించారు. ఎమ్ఎస్ఎమ్ఈ పాలసీకి గేమ్ఛేంజర్ గా భారత్ మారనుందని పేర్కొన్నారు. భారత్లో భారీ పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారని తెలిపారు. పవర్, ఇన్సూరెన్స్, మైనింగ్ సహా పలు రంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని. పలు రంగాల్లో భారీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఏపీలోనే తొలిసారి విద్యుత్ రంగం సంస్కరణలు తీసువచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు.
కమ్యూనిజం పోయి.. టూరిజం మిగిలింది..
ఈ బడ్జెట్ సమ్మిళిత అభివృద్ధికి దోహదం చేస్తుందని.. అన్నదాత, యువత, మహిళలు ఈ బడ్జెట్ ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందనున్నారని తెలిపారు. వ్యవసాయ రంగంపై ఇప్పటికే దేశ జనాభాలో 50% కంటే ఎక్కువ ఆధారపడి ఉన్నారన్నారు. దీనిపై ఫోకస్ పెంచడం ద్వారా భారత్ ఫుడ్ సప్లయ్ చైన్లో గ్లోబల్ లీడర్ అవుతుందన్నారు. ఈరోజుల్లో వర్క్ ఫ్రమ్ హోం సాధారణం అయిపోయిందని.. ఇంట్లో కూర్చుని మరోవైపు వ్యవసాయం పర్యవేక్షించుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. ఈ బడ్జెట్ ద్వారా మరింత ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అలాగే గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇచ్చారని.. సూర్య ఘర్ పథకం ద్వారా విద్యుత్ పంపిణీ నష్టాలు లేకుండా స్వయం సమృద్ధి కుటుంబ స్థాయిలో సాధ్యపడుతుందన్నారు. ‘‘చాలా కాలం క్రితం ఒక మాట చెప్పా.. కమ్యూనిజం అయిపోయింది.. ఇప్పుడు టూరిజం మాత్రమే మిగిలి ఉంది అని. ఇప్పుడు అదే జరిగింది. చైనాలో కూడా అనుసరిస్తున్న విధానం కమ్యూనిజం కాదు. సరైన నాయకత్వంలో సరైన దిశలో దేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తున్నాయి’’ అని చెప్పుకొచ్చారు.
ఆ రెండు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఫెల్యూర్..
ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రెండూ ఫెయల్యూర్ మోడల్స్ అంటూ సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో డ్రైనేజీ వాటర్, డ్రింకింగ్ వాటర్ కలిసిపోతున్నాయన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలని మోదీ అనుకున్నారని.. కానీ ఢిల్లీలో ఆ పథకాన్ని అమలు చేయలేదని.. అలా చేస్తే క్రెడిట్ మోదీకే వెళ్తుందని చేయలేదని అన్నారు. స్వచ్ఛ భారత్ కూడా అమలు చేయలేదని.. ఢిల్లీలో ఎక్కడ చూసినా దుర్గంధమే… చెత్తాచెదారమే అని విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో కొత్త మౌలిక వసతులు ఏవైనా కల్పించారా? ఎప్పుడో కట్టినవే తప్ప కొత్త ప్రాజెక్ట్స్ ఏమీ లేవన్నారు. ఎవరైనా ఢిల్లీకి ఉపాధి అవకాశాల కోసం వస్తారని… కానీ ఇప్పుడు అందరూ ఢిల్లీ విడిచి హైదరాబాద్, బెంగుళూరు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఎన్డీఏకు ఎందుకు ఓట్లు వేయాలో చెప్పడానికి ఢిల్లీ వచ్చా:
బీజేపీ, ఎన్డీఏకు ఎందుకు ఓట్లు వేయాలో చెప్పడానికి ఢిల్లీ వచ్చానని చెప్పారు. ఢిల్లీ చూసినప్పుడు అందరిలో ఒక అభిప్రాయం వస్తుందని.. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం ఆరోగ్యానికి హానీకరమన్నారు. ఢిల్లీలో కలుషితమైన నీరు ఉందని.. యమున కలుషితం అయిపోయిందన్నారు. వికసిత భారత్ రియాలిటీ అని చెప్పుకొచ్చారు. దావోస్లో అందరూ ఇండియా గురించి మాట్లాడుతున్నారన్నారు. బడ్జెట్లో రాష్ట్రనికి కొంత ప్రయారిటి ఇచ్చారన్నారు. బడ్జెట్లో ఏం ఇచ్చారని కొందరు అంటున్నారని…. మన పేరు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
కాగా.. ఆదివారం ఢిల్లీలోని షహదారా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న చంద్రబాబు… షహదారా ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఈరోజు ఏపీకి రానున్నారు సీఎం చంద్రబాబు. నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీ నుంచి ఏపీ సచివాలయానికి చంద్రబాబు రానున్నారు. ఆర్టీజీతో పాటు ప్రభుత్వ పథకాల, కార్యక్రమాల అమలుపై ఫీడ్ బ్యాక్పై సమీక్ష చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు సచివాలయం నుంచి ఉండవల్లి నివాసానికి వెళతారు సీఎం చంద్రబాబు.