Chandrababu Naidu Family Tirumala Darshan: శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం
- Author : Vamsi Chowdary Korata
Date : 21-03-2026 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
Nara Devansh Birthday ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో సీఎం చంద్రబాబు కుటుంబం స్వయంగా అన్నప్రసాదాలను భక్తులకు వడ్డించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం పాల్గొంది. అంతకుముందు తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం దగ్గర చంద్రబాబు కుటుంబానికి ఈవో ముద్దాడ రవిచంద్ర, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభం దగ్గర నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వకుళమాతను, ఆలయ ప్రదక్షిణగా వచ్చి విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగనరసింహస్వామివారిని దర్శించుకుని హుండిలో కానుకలు సమర్పించారు.
శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనాలు ఇవ్వగా.. టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిలు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, పరాభవ నామ సంవత్సర పంచాంగం, డైరీ, క్యాలెండర్, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను ఛైర్మన్, ఈవోలు అందించారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో చంద్రబాబు కుటుంబం భక్తులకు అన్నప్రసాదాలను స్వయంగా వడ్డించింది. ప్రతి ఏడాది దేవాన్ష్ పుట్టిన రోజు నాడు చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. అన్నప్రసాదానికి రూ.44 లక్షలు విరాళం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.
తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం కాలి నడకన తరిగొండ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్కు వెళ్లారు. తిరుమల మాడవీధుల్లో భక్తులకు నమస్కరిస్తూ ముందుకు సాగారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్. అలాగే తిరుమల మాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులతో చంద్రబాబు, దేవాన్ష్ ఫోటో దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భక్తుల దగ్గరకు వెళ్లి వారితో కరచాలనం చేశారు. కొందరు భక్తులు దేవాన్ష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకుంది. ముఖ్యమంత్రి తిరుమల అభివృద్ధిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరికి కీలక సూచనలు చేశారు. సీఎం తిరుమలలోని శ్రీ గాయత్రి నిలయం అతిథిగృహంలో ముగ్గురితో సమీక్ష చేశారు. తిరుమలలో విద్యుత్ వినియోగం, విండ్ మిల్ నుంచి విద్యుదుత్పత్తి, వినియోగంపై అడిగి తెలుసుకున్నారు. తిరుమలలో వాతావరణ పరిస్థితిపై ఆరా తీశారు. తిరుమలలో భక్తుల వసతి, తిరుపతిలో వసతి పెంపునకు చేస్తున్న ప్రణాళికల్ని అడిగి తెలుసుకున్నారు.