TDP : జగన్ది పేదలను దోచుకునే ప్రభుత్వం.. ఎస్.కోట “ఇదేం ఖర్మ” కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు
విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. నియోజకవర్గంలో ఇదేం ఖర్మ
- Author : Prasad
Date : 19-05-2023 - 8:07 IST
Published By : Hashtagu Telugu Desk
విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. నియోజకవర్గంలో ఇదేం ఖర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. తాను ఎక్కడికి వెళ్లినా అన్ని వర్గాల ప్రజలు ఎనలేని ఆదరాభిమానాలు చూపుతున్నారని.. వారి ఆదరాభిమానాలు మరువలేనివని ప్రజలు ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. టీడీపీకి మద్దతుగా యువత ముందుకు రావడం సంతోషదాయకమని.. యువత అంతా కలిసి పేటీఎం తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ లాంటి సైకోలను అణచివేయాలని.. జగన్ అధికారంలోకి వచ్చాక ఇంటి పన్ను పెరిగిందా లేదా? అని ఆయన ప్రశ్నించారు. బటన్లు నొక్కడం వలన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. జగన్ నొక్కేది బటన్ నొక్కుడు కాదని..బటన్ బొక్కుడని ఆయన ఆరోపించారు. పది రూపాయలు ఇచ్చి రూ.100లు లాక్కుంటున్నారని.. జగన్ ది పేదల ప్రభుత్వం కాదని.. పేదలను దోచే ప్రభుత్వమన్నారు. ఈ విషయాన్ని ఆడబిడ్డలు గుర్తుంచుకోవాలని.. ఆడవాళ్లు వంటగదిలోకి వెళితే సైకో ముఖ్యమంత్రి గుర్తుకొస్తాడని ఆయన తెలిపారు. ఒకప్పుడు ఉల్లిపాయలు కట్ చేస్తే కళ్ళల్లో నీరు వచ్చేవని.. నేడు వంటగదిలోకి వెళ్లి గ్యాస్ సిలిండర్ను చూసినా.. నిత్యవసర వస్తువులు చూసినా కళ్ళ నీళ్లు వచ్చే పరిస్థితి ఉందన్నారు. అందుకే తాను బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రారంభించానని చంద్రబాబు తెలిపారు.