Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్సీసీ ప్రత్యేక డైరెక్టరేట్
- Author : Vamsi Chowdary Korata
Date : 16-06-2026 - 11:37 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం మరో కీలక ప్రాజెక్టును కేటాయించింది. రాష్ట్రానికి ఎన్సీసీ (నేషనల్ కాడెట్ కార్ప్స్) డైరెక్టరేట్ను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్సీసీ హెడ్క్వార్టర్స్ డైరెక్టరేట్ జనరల్ ప్రకటన విడుదల చేసింది. ఏపీతో పాటుగా జార్ఖండ్కు కూడా డైరెక్టరేట్ను మంజూరు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 17 డైరెక్టరేట్లు ఉండగా.. తాజాగా ఏపీ, జార్ఖండ్లకు కొత్తగా కేటాయించిన వాటితో కలిపి 19కి పెరగనుంది. కొత్తగా డైరెక్టరేట్ ఏర్పాటుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు ఎన్సీసీ కార్యక్రమాలు మరింత దగ్గరవుతాయని చెబుతున్నారు. రాష్ట్రంలో కొత్త డైరెక్టరేట్తో గతంలో కంటే ఎక్కువ మంది విద్యార్థులకు ఎన్సీసీ శిక్షణ ఇవ్వొచ్చు.
కేంద్రం రాష్ట్రంలో డైరెక్టరేట్ను మంజూరు చేయడంతో ఇక్కడ కొత్త పరిపాలన వ్యవస్థ రానుంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని విద్యాసంస్థలపై మరింతగా దృష్టి సారించి ఎన్సీసీ కార్యకలాపాలు విస్తరించేందుకు మరింత వీలు కలుగుతుందని తెలిపారు. యువతకు శిక్షణ పరంగా మౌలిక సదుపాయాలు మెరుగుపరిస్తే వారికి మరికొన్ని అవకాశాలు వస్తాయి. ఎన్సీసీలో శిక్షణ పొందిన యువకులు క్రమశిక్షణతో జాతి పురోగతిలో భాగస్వాములవుతారని భావిస్తున్నారు. దేశంలో ఎన్సీసీ 1948లో ఏర్పాటైంది.. అప్పుడు మొత్తం 20 వేల మంది క్యాడెట్స్తో దీనిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎన్సీసీ క్యాడెట్ల సంఖ్య 20 లక్షలకు పెరిగింది. 2014 నుంచి 2025 వరకు క్యాడెట్ల సంఖ్య 6 లక్షలకు పెరిగింది. ఎన్సీసీ ప్రపంచంలోనే అతిపెద్ద యూనిఫామ్డ్ యూత్ ఆర్గనైజేషన్గా ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం 750 జిల్లాలకు ఎన్సీసీ కార్యకలాపాలు విస్తరించాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, జ్యుడీషియల్ ఆఫీసర్లకు సంబంధించిన డీఏ (డియర్నెస్ అలవెన్స్)పై కీలక నిర్ణయం తీసుకుంది. డీఏను 58 శాతం నుంచి 60 శాతానికి ప్రభుత్వం పెంచాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచే ఈ డీఏ అమల్లోకి వస్తుందని తెలిపారు. అలాగే డీఆర్ (డియర్నెస్ రిలీఫ్)ను కూడా 58 శాతం నుంచి 60 శాతానికి పెంచింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.