CM Chandrababu : ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కార్యాచరణ: సీఎం చంద్రబాబు
పీపీపీ పద్ధతిలో ఆస్పత్రులు నిర్మించి, నిర్వహించేలా ఆలోచన చేయాలన్నారు. ఇందుకోసం ముందుకొచ్చే సంస్థలకు పరిశ్రమల తరహాలోనే సబ్సిడీలు ఇచ్చే విధానం రూపొందించాలని అధికారులకు సూచించారు.
- By Latha Suma Published Date - 06:25 PM, Fri - 4 April 25

CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సచివాలయంలో వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో కొత్తగా 13 డీ-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అమరావతి మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అవసరాన్ని బట్టి పీహెచ్సీ, సీహెచ్సీలో వర్చువల్ వైద్యసేవలు అందించాలన్నారు.
Read Also: Bomb : వరంగల్ జిల్లా కోర్టులో బాంబు కలకలం
ఈ సందర్భంగా 175 నియోజకవర్గాల్లో 100 పడకలకుపైగా సామర్ధ్యం ఉన్న ఆస్పత్రులు ఇప్పటికే 70 ఉండగా మరో 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్ నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని తెలిపారు. పీపీపీ పద్ధతిలో ఆస్పత్రులు నిర్మించి, నిర్వహించేలా ఆలోచన చేయాలన్నారు. ఇందుకోసం ముందుకొచ్చే సంస్థలకు పరిశ్రమల తరహాలోనే సబ్సిడీలు ఇచ్చే విధానం రూపొందించాలని అధికారులకు సూచించారు. అన్యారోగ్యం బారిన పడిన తర్వాత వైద్యసేవలు అందించే పరిస్థితి నుంచి.. ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. రూ.32.5 కోట్లతో 25 డ్రగ్ డీఎడిక్షన్ సెంటర్లను సేవలు పెంచడంతోపాటు కొత్తగా మరో 13 డ్రగ్ డీఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇక, ప్రపంచ దేశాలన్నీ వైద్యం కోసం అమరావతి వచ్చేలా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నారు. విద్య-వైద్య రంగాలు తమ ప్రాధామ్యాలుగా చెప్పిన ఆయన.. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు. పీహెచ్సీ, సీహెచ్సీ స్థాయిలో వైద్యులు అందుబాటులో లేని సమయంలో రోగులకు వర్చువల్ విధానంలో ప్రాథమిక సేవలు అందేలా చూడాలన్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్ను ఉపయోగించి ఆరోగ్య సంరక్షణ అందించడానికి డిజిటల్ నెర్వ్ సెంటర్ దోహదపడుతుందని, దేశంలోనే అత్యధికంగా 4.47 కోట్ల (88 శాతం) మందికి రాష్ట్రంలో అభా కార్డులు జారీ అయ్యాయని తెలిపారు. ఏజెన్సీ ఏరియాలోని పీహెచ్సీల్లో వైద్య ఖాళీల భర్తీ, విజయనగరంలో కొత్తగా 8 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుపై సమీక్షించారు. ఎన్టీఆర్, విజయనగరం, బాపట్ల జిల్లాల్లో డయాలసిస్ మెషిన్లు పెంచడం, కొవ్వూరు-నిడదవోలు సీహెచ్సీలను అప్గ్రేడ్ చేయడం తదితర అంశాలపైన మార్గదర్శకాలు జారీ చేశారు. కుప్పం డిజిటల్ నెర్వ్ సెంటర్ పురోగతి గురించి సీఎం చంద్రబాబు ఆరా తీశారు.
Read Also: Annamalai : తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేసులో లేను : అన్నామలై