భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలలో కొత్త చిక్కులు?!
భారత్ దీనిని ఎప్పుడూ 'ప్రతీకారం' అని చెప్పలేదు. చౌక దిగుమతుల వల్ల MSP పడిపోతున్నందున దేశీయ రైతులను రక్షించుకోవడమే దీని లక్ష్యం.
- Author : Gopichand
Date : 17-01-2026 - 4:56 IST
Published By : Hashtagu Telugu Desk
Tariff Relief From India: భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలలో కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇద్దరు అమెరికన్ సెనేటర్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లేఖ రాస్తూ భారత్ అమెరికన్ పప్పు ధాన్యాలపై విధించిన 30% దిగుమతి సుంకాన్ని ‘అన్యాయం’ అని పేర్కొన్నారు. దానిని తొలగించేలా ఒత్తిడి చేయాలని కోరారు. ఈ సుంకం 30 అక్టోబర్ 2025న ప్రకటించబడింది. 1 నవంబర్ 2025 నుండి అమలులోకి వచ్చింది. 2025లో ట్రంప్ ప్రభుత్వం భారత్పై విధించిన 50% టారిఫ్కు భారత్ ఇస్తున్న నిశ్శబ్ద సమాధానంగా చాలా మంది నిపుణులు, సోషల్ మీడియా వినియోగదారులు దీనిని భావిస్తున్నారు. కానీ భారత్ దీనిని ఎప్పుడూ ప్రతీకార చర్యగా ప్రచారం చేయలేదు.
దేశీయ పప్పు ధాన్యాల ధరలు పడిపోకుండా కాపాడటమే భారత్ ఉద్దేశ్యం. కెనడా, ఆస్ట్రేలియా, రష్యా నుండి చౌకగా దిగుమతులు రావడం వల్ల మార్కెట్లో మినుములు, కందులు, పెసలు, మసూర్ పప్పుల ధరలు కనీస మద్దతు ధర (MSP) కంటే దిగువకు పడిపోయాయి. అయితే భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మోంటానా, నార్త్ డకోటాలోని ఉత్పత్తిదారులు నష్టపోయారు.
Also Read: CBN : నేడు రూ.13 వేల కోట్ల ప్రాజెక్ట్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
అమెరికన్ సెనేటర్లు ట్రంప్కు రాసిన లేఖలో ఏముంది?
మోంటానా సెనేటర్ స్టీవ్ డేన్స్, నార్త్ డకోటా సెనేటర్ కెవిన్ క్రేమర్ ట్రంప్కు రాసిన లేఖలో.. నవంబర్ 1 నుండి అమెరికన్ బఠానీలపై భారత్ విధించిన 30% పన్ను వల్ల అమెరికన్ పప్పు ధాన్యాల ఉత్పత్తిదారులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద పప్పు ధాన్యాల వినియోగదారు. ఇక్కడ మసూర్, శనగలు, ఎండు చిక్కుళ్ళు, బఠానీలను ఎక్కువగా తింటారు. కానీ అమెరికన్ ఉత్పత్తులపై భారీ సుంకాలు ఉన్నాయి. ఏదైనా వాణిజ్య ఒప్పందానికి ముందే అమెరికన్ పప్పు ధాన్యాలకు మెరుగైన మార్కెట్ ప్రాప్యతను నిర్ధారించాలని వారు కోరారు. ఇది రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. 2020లో కూడా వీరు ట్రంప్కు లేఖ రాశారు. ఆ తర్వాత ‘నమస్తే ట్రంప్’ ఈవెంట్ సందర్భంగా ట్రంప్ ఈ అంశాన్ని ప్రధాని మోదీ వద్ద ప్రస్తావించారు.
ఇది ట్రంప్ టారిఫ్కు ప్రతీకార చర్యేనా?
భారత్ దీనిని ఎప్పుడూ ‘ప్రతీకారం’ అని చెప్పలేదు. చౌక దిగుమతుల వల్ల MSP పడిపోతున్నందున దేశీయ రైతులను రక్షించుకోవడమే దీని లక్ష్యం. అయితే ట్రంప్ 50% టారిఫ్ విధించిన తర్వాతే ఈ నిర్ణయం రావడంతో చాలా మంది దీనిని “నిశ్శబ్ద సమాధానం”గా భావిస్తున్నారు. భౌగోళిక రాజకీయ నిపుణుడు నవ్రూప్ సింగ్ X (ట్విట్టర్)లో ఇలా రాశారు. దిగుమతి చేసుకునే పప్పు ధాన్యాలపై టారిఫ్ను 30%కి పెంచడం ద్వారా భారత్ అమెరికన్ టారిఫ్కు సమాధానం ఇచ్చింది. ఇది అక్టోబర్ 2025 నుండి అమల్లోకి వచ్చింది. మేము నిశ్శబ్దంగా ప్రతీకార చర్య తీసుకున్నాము అని రాసుకొచ్చారు.