PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత సాయం కోరిన జేఏఏసీ నేత
- Author : Vamsi Chowdary Korata
Date : 06-07-2026 - 12:30 IST
Published By : Hashtagu Telugu Desk
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పాకిస్థాన్ పాలకుల అణచివేత వైఖరిపై స్థానిక ప్రజలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఆహార కొరత, పౌర హక్కుల హరణతో అట్టుడుకుతున్న ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) కీలక నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ భారతదేశంతో సన్నిహిత సంబంధాలను కోరుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరసనలపై ఇస్లామాబాద్ ప్రభుత్వం సాగిస్తున్న క్రూరమైన ఆంక్షల కారణంగా పీఓకేలో తీవ్రమైన ఆర్థిక దిగ్బంధనం ఏర్పడిందని ఆయన ఆరోపించారు.
“మాకు భారతదేశం నుండి మానవీయ కోణంలో సహాయం కావాలి. ఇక్కడ రేషన్, నిత్యావసరాలు, మందుల కొరత తీవ్రంగా ఉంది. మాకు మీ మద్దతు అవసరం” అని అమన్ ఖాన్ కోరారు. లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వెంబడి ఉన్న పూంచ్, డోడా సెక్టార్ల సరిహద్దులను తెరవాలని విన్నవించారు. ఇక్కడి పరిస్థితులు మరింత దిగజారితే, ప్రజలు భారతదేశంలోకి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉందని తెలిపారు. రావల్ కోట్లోని ఈద్గా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
“మనం నియంత్రణ రేఖ (LoC) వైపు వెళ్దామా?” అని ప్రజలను ఆయన ప్రశ్నించగా… అక్కడి జనం “సరిహద్దుల వైపే సాగుదాం” అంటూ ఏకగ్రీవంగా నినదించారు. తమ న్యాయమైన డిమాండ్లపై బుల్లెట్లతో సమాధానం చెబితే… తమకు వేరే మార్గాలు కూడా ఉన్నాయని పాక్ పాలకులను ఆయన హెచ్చరించారు.
గత నెల రోజులుగా పాక్ పరిపాలనకు వ్యతిరేకంగా పీఓకేలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈద్గా గ్రౌండ్లో జరిగిన ర్యాలీలో ‘పీఓకే పాకిస్థాన్లో భాగం కాదు’, ‘మాకు స్వాతంత్ర్యం కావాలి’ అంటూ ప్రజలు బహిరంగంగానే నినాదాలు చేశారు. కేవలం స్థానిక సంస్కరణల కోసం మొదలైన ఈ ఉద్యమం… ఇప్పుడు పాకిస్థాన్ అక్రమ నియంత్రణ నుంచి విముక్తి పొందాలనే డిమాండ్ల దిశగా మలుపు తిరిగింది.
నిరసనకారులను అణచివేసేందుకు పాక్ ప్రభుత్వం జూన్ 5న ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ‘జేఏఏసీ’ సంస్థను నిషేధిత ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. సైనిక బలగాలను రంగంలోకి దించి స్థానిక రాజకీయ గొంతులను నొక్కేందుకు ఇస్లామాబాద్ ప్రయత్నిస్తోందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దశాబ్దాలుగా పీఓకే, గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతాల్లో పాక్ ప్రధాన పార్టీలే లబ్ధి పొందుతున్నాయని, స్థానిక నాయకత్వాన్ని ఎదగనివ్వకుండా తొక్కిపెడుతున్నారని అంతర్జాతీయ శాంతి అధ్యయన కేంద్రం నివేదిక కూడా స్పష్టం చేసింది.