China : పర్యావరణ పరిరక్షణ కోసం చైనా కీలక చర్యలు..
చైనాలోని యాంగ్జీ నది ఆసియాలో అతి పొడవైన నదిగా పేరుపొందింది. ఈ నది ఒక్క చైనా ఆర్థికవ్యవస్థకే కాకుండా, ఆహార భద్రతకూ కీలకంగా మారింది. అయితే, గత కొన్ని దశాబ్దాలుగా యాంగ్జీ నదిపై, దాని ఉపనదులపై నిర్మించిన అనేక డ్యామ్లు, హైడ్రోపవర్ ప్రాజెక్టులు ప్రకృతి వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి.
- By Latha Suma Published Date - 12:03 PM, Sat - 12 July 25

China : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటైన చైనా, ఇప్పుడు తన అభివృద్ధి మాదిరిని తిరిగి పరిశీలిస్తోంది. ఇటీవల చైనా తీసుకున్న చర్యలు ఈ విషయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. స్వల్పకాలిక లాభాలను వదిలిపెట్టి, దీర్ఘకాలికంగా ప్రకృతి పరిరక్షణపై దృష్టి కేంద్రీకరించింది. చైనాలోని యాంగ్జీ నది ఆసియాలో అతి పొడవైన నదిగా పేరుపొందింది. ఈ నది ఒక్క చైనా ఆర్థికవ్యవస్థకే కాకుండా, ఆహార భద్రతకూ కీలకంగా మారింది. అయితే, గత కొన్ని దశాబ్దాలుగా యాంగ్జీ నదిపై, దాని ఉపనదులపై నిర్మించిన అనేక డ్యామ్లు, హైడ్రోపవర్ ప్రాజెక్టులు ప్రకృతి వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి.
Read Also: Peddi : ‘పెద్ది’లో శివరాజ్ కుమార్ లుక్ రిలీజ్
ఈ నేపథ్యంలో, 2020 నుంచి చైనా ప్రభుత్వం గణనీయమైన మార్పులు ప్రారంభించింది. ఇప్పటి వరకు 300 డ్యామ్లను కూల్చివేయడం ద్వారా నదుల సహజ ప్రవాహాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న 373 హైడ్రోపవర్ ప్రాజెక్టుల్లో 342 చిన్న స్థాయి ప్రాజెక్టుల కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ చర్యలన్నీ ఒకే లక్ష్యాన్ని ఉద్దేశించాయి. జలవనరుల సహజత్వాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడటం. ఈ మార్పుల వెనుక ప్రధాన కారణం చిషుయ్ హే (Chishui River, లేదా Red River) వంటివి. యాంగ్జీ నదికి అనుబంధంగా ఉన్న ఈ ఉపనది, స్థానికంగా అరుదైన చేప జాతులకు స్వర్గధామంగా పరిగణించబడుతుంది. అయితే, విస్తృతంగా నిర్మించబడిన డ్యామ్లు, పవర్ స్టేషన్ల వల్ల ఈ నదిలో నీటి ప్రవాహం నిలిచిపోయింది. దాని ఫలితంగా జీవవైవిధ్యం కోల్పోయింది. కొన్ని ప్రాంతాల్లో నది పూర్తిగా ఎండిపోయింది కూడా.
చైనా ప్రభుత్వం ఈ దుస్థితిని దృష్టిలో పెట్టుకుని, రెడ్ రివర్ పునరుద్ధరణ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. ఇది కేవలం నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించడమే కాదు, నదిలో నివసించే జీవుల ఉనికిని తిరిగి స్థిరపరచడానికి తీసుకున్న ప్రణాళికగాచి చూడవచ్చు. ఇది వరకూ నదిలో కనిపించేవి కాని, 2022 నాటికి అంతరించిపోతున్న జాతిగా ప్రకటించబడిన యాంగ్జీ స్టర్జన్ (Yangtze Sturgeon) చేపను తిరిగి పరిచయం చేయడంలో చైనా విజయం సాధించింది. ఈ చేప ఒకప్పుడు యాంగ్జీ పరివాహక ప్రాంతమంతా విస్తరించి ఉండేది. కానీ 1970ల నుంచి దాని జనసంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణాలు – డ్యామ్ నిర్మాణాలు, చేపల అధిక వేట.
అయితే 2023, 2024లో రెండు విడతలుగా యాంగ్జీ స్టర్జన్ చేపలను నదిలోకి విడదల చేయగా, అవి విజయవంతంగా నిలదొక్కుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది చైనా చేపట్టిన పర్యావరణ చర్యలకు ఎంతో భరోసానిచ్చే పరిణామం. ఒకప్పుడు అంతరించిపోతున్న జాతిని తిరిగి జీవితం పంక్తిలోకి తీసుకురావడం చిన్న విషయమేం కాదు. చైనా తాజా చర్యలు పర్యావరణ పరిరక్షణలో అనేక దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పర్యావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి ముసుగులో ప్రకృతిని దుర్వినియోగం చేయడం మానుకుని, దానిని పునరుద్ధరించాలనే దిశగా డ్రాగన్ చర్యలు ఎంతగానో ప్రేరణనిస్తాయని చెప్పవచ్చు.
Read Also: Jaishankar : చైనా పర్యటనకు మంత్రి జై శంకర్..ఐదేళ్ల తర్వాత ఎందుకెళుతున్నారంటే..