Hormuz Strait: 10 వేల మంది సైనికులతో హార్ముజ్ దిగ్బంధనం – అమెరికా
- Author : Vamsi Chowdary Korata
Date : 15-04-2026 - 12:00 IST
Published By : Hashtagu Telugu Desk
హర్మూజ్ జలసంధితో సహా ఇరాన్లోని కీలక ఓడరేవులపై పూర్తి దిగ్బంధనాన్ని విజయవంతంగా అమలు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. హర్మూజ్ జలసంధిపై దిగ్బంధనానికి ఇరాన్ పోర్టుల్లో దాదాపు 10 వేల మంది సైనికులు, మెరైనర్లు, వైమానిక దళ సిబ్బందిని అమెరికా మోహరించింది.
సముద్ర మార్గం ద్వారా జరిగే అంతర్జాతీయ వాణిజ్యంపైనే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఆధారపడి ఉంటుందని, కానీ దిగ్బంధనం ప్రారంభించిన 36 గంటల్లోనే ఇరాన్ నుంచి వెళ్లే వాణిజ్య నౌకలను అమెరికా దళాలు పూర్తిగా నిలిపివేశాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మైరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు.
అమెరికా నావికాదళ పర్యవేక్షణలో క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని, అవి ఇరాన్ పోర్టుల నుంచి బయటకు వచ్చే నౌకలను, లోపలకు వెళ్లే వాటిని లక్ష్యంగా చేసుకుంటాయని ‘ఎక్స్’ వేదికగా అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇదిలా ఉండగా, గల్ఫ్ దేశాల నుంచి బయల్దేరి హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లడానికి ప్రయత్నించిన రిచ్ స్టార్రీ అనే నౌక అమెరికా విధించిన దిగ్బంధనం కారణంగా వెనుదిరిగింది. ఈ నౌక 2.50 లక్షల బ్యారెళ్ల చమురును యూఏఈలో నింపుకుని బయల్దేరిందని షిప్పింగ్ డేటా వెల్లడించింది.