Terrorists Attack : గాఢ నిద్రలో ఉండగా ఏడుగురు కార్మికుల కాల్చివేత
Terrorists Attack : ఉగ్ర కూపంగా మారిన పాకిస్తాన్ ఉగ్రవాద దాడులతో అల్లాడుతోంది.
- Author : Pasha
Date : 09-05-2024 - 2:30 IST
Published By : Hashtagu Telugu Desk
Terrorists Attack : ఉగ్ర కూపంగా మారిన పాకిస్తాన్ ఉగ్రవాద దాడులతో అల్లాడుతోంది. టెర్రరిస్టుల ఎటాక్స్లో(Terrorists Attack) అక్కడి సామాన్య ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. తాజాగా గురువారం తెల్లవారుజామున పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉన్న గ్వాదర్ పోర్టు సమీపంలో ఉన్న ఇళ్లపై కొందరు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆ ఇళ్లలో గాఢ నిద్రలో ఉన్న ఏడుగురు చనిపోయారు. చనిపోయిన వారంతా కార్మికులని వెల్లడైంది. ఇదే ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన కార్మికులను పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న ఖనేవాల్ జిల్లా వాస్తవ్యులుగా గుర్తించారు. వీరంతా కలిసి గ్వాదర్ పోర్టు ఏరియాలోని ఓ షాపులో పని చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ఈ ఘటన జరిగిన వెంటనే చనిపోయిన వారి డెడ్ బాడీస్ పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తికి చికిత్స కొనసాగుతోంది.
We’re now on WhatsApp. Click to Join
ఈ ఘటనపై బెలూచిస్తాన్ సీఎం మీర్ సర్ఫరాజ్ బుగ్తీ తీవ్రంగా స్పందించారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఉగ్రవాదులకు సహకరించిన వ్యక్తులను కూడా విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులను ఆయన బహిరంగ ఉగ్రవాదంగా అభివర్ణించారు. కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అమాయక కార్మికులను చంపడం పిరికిపందల చర్యే అని బలూచిస్తాన్ హోం మంత్రి మీర్ జియా ఉల్లా లాంగౌ అన్నారు. ఈఘటనపై విచారణకు ఆదేశించారు.
Also Read : Telangana Student Missing : అమెరికాలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్.. ఏమైంది ?
బెలూచిస్తాన్ ప్రావిన్స్లోని గ్వాదర్ పోర్టును చైనా కంపెనీలు నిర్వహిస్తుంటాయి. దీన్ని చాలా ఏళ్లుగా బెలూచిస్తాన్ ప్రజలు, ప్రజా సంఘాలు, మిలిటెంట్ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. తమ ప్రాంత సంపదను, ఖనిజ వనరులను చైనాకు దోచిపెడుతున్నారనే ఆవేదన స్థానికుల్లో నాటుకుపోయింది. అందుకే గ్వాదర్ పోర్టుతో ముడిపడిన పనులు చేసేందుకు వచ్చే ఇతర ప్రాంతాల వారిపై ఈ తరహా దాడులు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నెల 4న కూడా బెలూచిస్తాన్ ప్రావిన్స్లో జరిగిన బాంబు పేలుడులో సీనియర్ జర్నలిస్టు సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇంకో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఆ ఘటనను మరువకముందే.. మరో ఏడుగురిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు.