Chicken Price Hike : చికెన్, గుడ్ల ధరలు పైపైకి.. ఎందుకంటే ?
చికెన్ ధర పైపైకి పోతోంది. గత వారం రోజుల వ్యవధిలోనే కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.20 నుంచి రూ.30 దాకా పెరిగి(Chicken Price Hike) రూ.230కి చేరింది.
- Author : Pasha
Date : 19-05-2023 - 12:41 IST
Published By : Hashtagu Telugu Desk
చికెన్ ధర పైపైకి పోతోంది. గత వారం రోజుల వ్యవధిలోనే కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.20 నుంచి రూ.30 దాకా పెరిగి(Chicken Price Hike) రూ.230కి చేరింది. దీంతో చికెన్ కొనలేక.. తినకుండా ఉండలేక మాంసాహార ప్రియులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో హైదరాబాద్ సహా కొన్నిచోట్ల కేజీ చికెన్ ధర రూ. 180 నుంచి రూ. 270 దాకా పెరిగింది. గత ఏడాది కంటే ఈసారి సమ్మర్ లో చికెన్ ధరలు(Chicken Price Hike) విపరీతంగా పెరిగాయి. గత సంవత్సరం ఇదే టైం లో కేజీ స్కిన్లెస్ చికెన్ ధర రూ. 150 నుంచి 180 వరకు ఉండేది. ఇప్పుడు అంతకంటే ఎక్కువే రేటు ఉంది. ఇంతకీ చికెన్ ధరలు ఎందుకు పెరిగాయి ? అనే అంశంలోకి వెళితే.. కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడం వల్లే చికెన్ ధరలు మండిపోతున్నాయని చెప్పొచ్చు. కొన్నిచోట్ల ఉక్కపోత వాతావరణంతో కోళ్లు చనిపోతున్నాయి. ఈ కారణంతో గత వారం రోజులుగా కోళ్ల ఫాంలలో పెంపకం తగ్గిపోయింది. దీన్ని ముందే గ్రహించిన వ్యాపారులు నష్టాల నుంచి గట్టెక్కడానికి పౌల్ట్రీలను మూసివేశారు. దీని ప్రభావంతో కోళ్ల దిగుబడి అమాంతం తగ్గిపోయింది. డిమాండ్ పెరిగింది. సాధారణంగా కోళ్లు 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే తట్టుకోలేవు. స్ప్రింకర్లతో చల్లబరచకపోతే వేడికి చనిపోతాయి. కోళ్ల దాణా, రవాణా ఖర్చులు, వాటి నిర్వహణకు పెద్ద మొత్తం ఖర్చులు పెరగడంతో కోళ్ల ధరలను కూడా పెంచేస్తున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉన్నాయి. ఎండలు మరింత ముదిరితే చికెన్ ధరలు ఇంకా పెరుగుతాయని చెబుతున్నారు. ఇక పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండడంతో కోళ్ల మాంసానికి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
ALSO READ : Robbery Case: నయా దోపిడీ.. చికెన్ వడ్డించారు, కోట్లు దొంగిలించారు!
గత వారం రోజుల వ్యవధిలోనే కోడిగుడ్డు ఒక్కొక్కటి రూపాయి మేర పెరిగింది. రూ.4.50 ఉండే గుడ్డు రూ.6.50 నుంచి రూ.7.50 వరకు చేరుకుంది. చికెన్ రేటు పెరుగుదలకు అనుగుణంగా .. గుడ్ల ధర కూడా ఇంకా పెరుగుతుందని అంటున్నారు. డజన్ ధర హోల్సేల్ లో రూ.70 గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో చిల్లర వర్తకులు ఒక్కో గుడ్డు రూ.7కి అమ్ముతున్నారు. దాణా ధరలు పెరగడం ఇందుకు కారణంగా కోళ్లఫారాల నిర్వాహకులు విశ్లేషిస్తున్నారు.