El Nino Effect: రైతులు తొందరపడి వరి నాట్లు వేయొద్దు.. రైతులకు మంత్రుల కీలక హెచ్చరిక
- Author : Vamsi Chowdary Korata
Date : 20-07-2026 - 10:45 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా ‘ఎల్నినో’ (El Niño) ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నందున, రైతులు తొందరపడి వరి నాట్లు వేయవద్దని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు అడుగంటిపోయాయని, సాగునీరు అందించే పరిస్థితి ఏమాత్రం సానుకూలంగా లేదని స్పష్టం చేశారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయనే ముందస్తు ఆశలతో సాగు చేపట్టి నష్టపోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భూగర్భ జలాలపై ఆధారపడి పంటలు పండించే రైతులు కూడా తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వరి వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల వైపు మళ్లడం శ్రేయస్కరమని పేర్కొన్నారు. అలాగే, ప్రతి చుక్క వర్షపు నీటిని సద్వినియోగం చేసుకునేలా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకుడుగుంతల (Soak pits) నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున వర్షపు నీటి సంరక్షణ చర్యలు మాత్రమే భవిష్యత్ తాగు, సాగునీటి కష్టాల నుంచి గట్టెక్కిస్తాయని ఆయన వివరించారు.