Akhilesh vs Yogi : “బుల్డోజర్” వివాదం..అఖిలేష్ vs యోగి
అఖిలేష్ హెచ్చరికలను యోగి ఆదిత్యనాథ్ బుధవారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో తిప్పికొట్టారు. బుల్డోజర్ నడపడానికి ధైర్యం, తెలివితేటలు, దృఢ సంకల్పం ఉండాలని, ఆ లక్షణాలేవీ యాదవ్లో లేవని అన్నారు. ''అందరి చేతులు బుల్డోజర్ నడపడానికి పనికి రావు.
- By Latha Suma Published Date - 06:35 PM, Wed - 4 September 24

Akhilesh vs Yogi: ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ల వివాదం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ , సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. తొలుత ఈ మాటల యుద్ధానికి అఖిలేష్ తెరతీయగా, దేనికైనా దమ్ముండాలంటూ యోగి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
సమాజ్ వాదీ పార్టీ 2027 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ పార్టీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు అన్ని బుల్డోజర్లను గోరఖ్పూర్ వైపు నడిపిస్తామని అఖిలేష్ యాదవ్ మంగళవారంనాడు జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు. యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్పూర్ కావడంతో ఈ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. అఖిలేష్ హెచ్చరికలను యోగి ఆదిత్యనాథ్ బుధవారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో తిప్పికొట్టారు. బుల్డోజర్ నడపడానికి ధైర్యం, తెలివితేటలు, దృఢ సంకల్పం ఉండాలని, ఆ లక్షణాలేవీ యాదవ్లో లేవని అన్నారు. ”అందరి చేతులు బుల్డోజర్ నడపడానికి పనికి రావు. దానికి ధైర్యం, తెలివితేటలు (దిల్, దిమాగ్) ఉండాలి. సమర్ధత, దృఢ సంకల్పం ఉన్నవాళ్లే బుల్డోజర్ నడపగలరు. అల్లర్లు సృష్టించేవారి ముందు మోకరిల్లేవారు బుల్డోజర్ ముందు నిలవలేరు” అని కౌంటర్ ఇచ్చారు.
అఖిలేష్ యాదవ్ను ‘టిప్పు’ అనే నిక్నేమ్తో యోగి సంబోధిస్తూ, టిప్పు ఇప్పుడు సుల్తాన్ కావాలని ప్రయత్నిస్తున్నారంటూ చురకలు వేశారు. 2017లో బీజేపీ అధికారంలోకి రాకముందు యూపీలో ‘ఆటవికపాలన’ ఉండేదన్నారు. అఖిలేష్ యాదవ్, ఆయన అంకుల్ శివపాల్ యాదవ్లు బలవంతపు వసూళ్లు చేసేవారని, ఏరియాలు పంచుకుని మనీ లూటీలకు పోటీ పడేవారని ఎద్దేవా చేశారు.