Telangana Rains: ఒకవైపు భారీ వర్షాలు..మరో వైపు కేసీఆర్ మొద్దు నిద్ర
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇండ్లను ఖాళీ చేసి వెళ్తున్నారు.
- Author : Vamsi Chowdary Korata
Date : 29-07-2023 - 5:01 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇండ్లను ఖాళీ చేసి వెళ్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోవట్లేదని ఆరోపణలు చేస్తున్నారు విపక్ష నేతలు. తాజాగా వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై ఘాటుగా విమర్శలు చేశారు. ఊర్లు మునిగినా,ఇండ్లు కూలినా,జనం వరదల్లో పడి కొట్టుకుపోతున్నా..దొర గడీ దాటి బయటకు రాడంటూ వ్యాఖ్యానించారు.
కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని సీఎం వానలు వెలిశాక చుట్టం చూపుగా గాలి మోటార్లో చక్కర్లు కొడతాడని విమర్శించారు షర్మిల. బాధితుల్ని ఆదుకుంటామని గప్పాలు కొడతాడు.ఇంటికి పది వేలు, పంటకు పదివేలు అనే ప్రకటనలు ఇస్తాడు.వెంటనే ఫామ్ హౌజ్ కొచ్చి మొద్దు నిద్ర పోతాడు. 9 ఏళ్లుగా భారీ వర్షాలకు,అకాల వర్షాలకు,వేల కోట్ల పరిహారం అంటూ చెప్పుడే తప్పా రూపాయి ఇచ్చింది లేదు.కనీసం వరదల్లో కొట్టుకుపోయిన వారి కుటుంబాలను ఆదుకున్నదీ లేదు.ఓట్ల కోసం డల్లాస్,ఇస్తాంబుల్,లండన్ అంటూ కల్లబొల్లి మాటలు చెప్పడం,వరదల్లో జనాన్ని నిండా ముంచడం..ఇదే పిట్టల దొర పాలన.వరదల్లో వరంగల్ మునక్కుండా 3ఏళ్ల క్రింద మాస్టర్ ప్లాన్ అని చెప్పినా ఫైల్ కదల్లేదని దుయ్యబట్టారు షర్మిల.
రూ.250 కోట్లు తక్షణం ఇవ్వండని అడిగినా పైసా ఇవ్వలేదు.వెయ్యి కోట్లతో భద్రాచలం కరకట్ట అని చెప్పి,ఆ హామీని సైతం గోదాట్లోనే కలిపాడు. ఏడాదిగా గేట్లు మొరాయించినా కడెం ప్రాజెక్టును పట్టించుకున్నది లేదు.ప్రమాదపుటంచులో ఉందని చెప్పినా బాగుచేసిందీ లేదు.పర్యటనకు వెళ్లిన మంత్రులు దేవుడే దిక్కని చెప్తున్న మాటలు..మీ విజనరీ పాలనకు నిదర్శనం.ప్రశ్నించే ప్రతిపక్షాలది చిల్లర రాజకీయం అయితే..జనాలను వరదల్లో పెట్టీ,బురదలో నెట్టి మీరు చేసేదాన్ని ఏమనాలి దొర?కనీసం ఎన్నికల ముందైనా వర్షాలతో సర్వం కోల్పోయిన వారిని ఆదుకోండి.చనిపోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వండి.కూలిన ఇండ్ల స్థానంలో పక్కా ఇండ్లు కట్టించాలని షర్మిల డిమాండ్ చేశారు.
Also Read: Rs 4 crore in 45 days : టమోటా రైతుకు 45 రోజుల్లో 4 కోట్లు