Road Accident : ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి
- Author : Prasad
Date : 30-05-2026 - 9:51 IST
Published By : Hashtagu Telugu Desk
ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని గ్రీన్ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. తల్లాడ మండలం రామానుజవరం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి ఎడమవైపు ఉన్న బారికేడును ఢీకొట్టింది. అనంతరం కారు పల్టీలు కొట్టి హైవేపై ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో కారును నడుపుతున్న సర్వణకాంతి జశ్వంత్ (36) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హైదరాబాద్లోని బొల్లారం పోలీస్ స్టేషన్లో 2021 బ్యాచ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో ఆయన భార్య జ్యోతి కిరణ్ మౌనికకు కాలు విరగగా, కుమార్తె మాన్య (6) కాలికి గాయాలయ్యాయి. కుమారుడు కళ్యాణ్ రామ్ (4) స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.వీరంతా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వస్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా.. మృతి చెందిన జశ్వంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.