New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్బీఐ కసరత్తు వేగవంతం
- Author : Prasad
Date : 30-05-2026 - 10:10 IST
Published By : Hashtagu Telugu Desk
భారత కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పులకు భారతీయ రిజర్వు బ్యాంక్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్ల స్థానంలో దశలవారీగా ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే అంశంపై ఆర్బీఐ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కరెన్సీ నిర్వహణ ప్రణాళికల్లో భాగంగా ప్లాస్టిక్ నోట్ల అమలుపై ఆర్బీఐ దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా ఈ నోట్లను ప్రవేశపెట్టేందుకు అవసరమైన పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. నీటిలో తడిసినా, పదే పదే మడతపెట్టినా లేదా ఎక్కువ కాలం వినియోగించినా సులభంగా చిరిగిపోవు. ఈ నోట్లలో అత్యాధునిక భద్రతా ఫీచర్లు, ప్రత్యేక సాంకేతికతలను అమలు చేయడం ద్వారా నకిలీ కరెన్సీ తయారీని గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం చలామణిలో ఉండటంతో పదే పదే కొత్త నోట్ల ముద్రణ అవసరం తగ్గుతుంది. దీని వల్ల ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వానికి ముద్రణ వ్యయం ఆదా అయ్యే అవకాశం ఉంది. పాత నోట్లను తరచుగా మార్చాల్సిన అవసరం తగ్గడం వల్ల కరెన్సీ నిర్వహణలో పర్యావరణానికి అనుకూల ప్రయోజనాలు కూడా లభించే అవకాశం ఉంది. ప్రారంభ దశలో ప్రజల్లో ఎక్కువగా చలామణి అయ్యే చిన్న విలువ కలిగిన నోట్లను పాలిమర్ రూపంలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. మొదట ప్రయోగాత్మకంగా విడుదల చేస ప్రజల స్పందనను పరిశీలించిన తర్వాత తదుపరి దశల్లో ₹200, ₹500 నోట్లను కూడా ప్లాస్టిక్ కరెన్సీ రూపంలో తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, ప్రజల వినియోగ విధానాలు, నోట్ల మన్నిక వంటి అంశాలపై నిపుణుల కమిటీలతో ఆర్బీఐ అధ్యయనం నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే ప్లాస్టిక్ నోట్ల విడుదలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.