Polavaram Project : పోలవరం ప్రాజెక్టు..ఏపీ ప్రతిపాదనలపై తెలంగాణ అభ్యంతరం
ఏప్రిల్ 8న జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA) సమావేశంలో పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ఎత్తిపోతల పనులు నిలిపేశామని చెప్పినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరంలోనే డెడ్ స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోందని వెల్లడించారు.
- By Latha Suma Published Date - 05:51 PM, Sat - 24 May 25

Polavaram Project : పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్కుమార్ గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB)తోపాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాసారు. అనిల్కుమార్ లేఖలో పేర్కొన్నదేమంటే, ఏప్రిల్ 8న జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA) సమావేశంలో పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ఎత్తిపోతల పనులు నిలిపేశామని చెప్పినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరంలోనే డెడ్ స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోందని వెల్లడించారు. ఈ ప్రతిపాదనలు కేంద్ర జల సంఘం (CWC) అనుమతులకు విరుద్ధమని, గోదావరి డెల్టా వ్యవస్థ ప్రయోజనాలకు ఇది నష్టం కలిగించే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు.
Read Also: Whatsapp : వాట్సాప్ లో కొత్త ఫీచర్..యూజర్లకు పండగే
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో ఇచ్చిన అనుమతుల్లో ఎక్కడా డెడ్ స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోసే అంశం లేదని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఈ ప్రక్రియ పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకమని అనిల్కుమార్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ చేపడుతున్న ప్రతి చిన్న ప్రాజెక్టుపైనా ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం తెలియజేస్తూ ఉండగా, తనే నిబంధనలు అతిక్రమిస్తూ ప్రాజెక్టులు చేపట్టడం దారుణమని ఆయన విమర్శించారు. అంతేకాక, ఈ ప్రతిపాదిత ఎత్తిపోతల పథకానికి కేంద్ర జల సంఘం అనుమతి లేదు. ఇలాంటి చర్యల వల్ల నీటి పంపిణీ సమతుల్యత దెబ్బతిని, మిగతా రాష్ట్రాలకు నష్టాలు ఏర్పడే అవకాశం ఉందని లేఖలో వివరించారు. సీడబ్ల్యూసీ తక్షణమే జోక్యం చేసుకొని, ఈ పనులను నిలిపివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అనుమతులేమి లేకుండా ఎత్తిపోతల పనులు చేపట్టడం అత్యంత బాధాకరమని, ఇది జాతీయ జల వనరుల పాలన విధానాలకు కూడా వ్యతిరేకమని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టు అయిన నేపథ్యంలో, ఇతర రాష్ట్రాల హక్కులను లెక్కచేయకుండా ఏపీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం గర్భితం అని అన్నారు. తద్వారా, ఈ అంశంలో గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ తక్షణమే జోక్యం చేసుకొని, ఏపీను ఈ పథకాన్ని అమలు చేయకుండా అడ్డుకోవాలని తెలంగాణ కోరుతోంది. ఈ వ్యవహారంలో కేంద్ర జల సంఘం, సంబంధిత అధికార సంస్థలు పలు పార్శ్వాల నుంచి పరిశీలించి, సమగ్ర నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన సూచించారు.