ఇండిగోకు భారీ షాక్.. సీఈవో పదవికి పీటర్ రాజీనామా!
వేలాది విమానాలు రద్దు కావడం లేదా తీవ్ర జాప్యం జరగడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు.
- Author : Gopichand
Date : 10-03-2026 - 9:42 IST
Published By : Hashtagu Telugu Desk
IndiGo CEO: ఇండిగో మాతృ సంస్థ ‘ఇంటర్గ్లోబ్ ఏవియేషన్’ మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. పీటర్ ఎల్బర్స్ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చిందని కంపెనీ తెలిపింది. కొత్త సీఈఓ నియామకం జరిగే వరకు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలికంగా విమానయాన సంస్థ నిర్వహణ బాధ్యతలను చేపడతారు. 2022లో ఇండిగో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఎల్బర్స్.. అంతర్జాతీయ విమానయాన రంగంలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. అయితే ఇటీవల ఎదురైన కార్యకలాపాల సంక్షోభం, తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కార్యకలాపాల సంక్షోభం- ఒత్తిడి
డిసెంబర్ 2025 ప్రారంభంలో ఇండిగో తన చరిత్రలోనే అతిపెద్ద కార్యకలాపాల సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీనికి ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి.
విమానాల రద్దు/ఆలస్యం: వేలాది విమానాలు రద్దు కావడం లేదా తీవ్ర జాప్యం జరగడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు.
డ్యూటీ టైమ్ నిబంధనలు: పైలట్ల కోసం కొత్తగా అమల్లోకి తెచ్చిన ‘డ్యూటీ టైమ్’ నిబంధనలను పాటించడంలో ఇండిగో ఇబ్బందులను ఎదుర్కొంది. ఇది మొత్తం విమాన షెడ్యూల్ను దెబ్బతీసింది.
Also Read: ఇరాన్ మరో సంచలన నిర్ణయం.. చమురు ధరలు పెరగనున్నాయా?!
డీజీసీఏ (DGCA) కఠిన చర్యలు
ఈ సంక్షోభం తర్వాత విమానయాన నియంత్రణ సంస్థ ‘డీజీసీఏ’ ఇండిగోపై కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. “ఇండిగో సంస్థపై సుమారు రూ. 22.20 కోట్ల జరిమానా విధించడంతో పాటు, రూ. 50 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా, విమాన కార్యకలాపాలను స్థిరీకరించడానికి ఎయిర్లైన్ యొక్క ‘వింటర్ ఫ్లైట్ ప్రోగ్రామ్’ను సుమారు 10 శాతం మేర తగ్గించవలసిందిగా సూచించింది.” ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా నాయకత్వంలో కంపెనీ తిరిగి గాడిలో పడేందుకు ప్రయత్నిస్తోంది. త్వరలోనే కొత్త సీఈఓ నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది.