Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్మెంట్లో కొత్త పాలసీ!
- Author : Vamsi Chowdary Korata
Date : 08-05-2026 - 10:33 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ కొత్త పద్ధతిని అమలులోకి తెచ్చింది.
దరఖాస్తు సమయంలో విద్యార్థులు తమ పదో తరగతి హాల్టికెట్ నంబర్, పుట్టినతేదీ, ఉత్తీర్ణులైన సంవత్సరం వంటి వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత ఆధార్లోని పేరు, పదో తరగతి మెమోలోని పేరు సరిపోలితేనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటి దశ పూర్తయ్యాక విద్యార్థికి ఒక ఐడీ వస్తుంది. అనంతరం మీ-సేవ కేంద్రాల్లో ఆధార్ బయోమెట్రిక్ ప్రాసెస్ పూర్తి చేసి, ఆన్లైన్లో మిగతా వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. రెన్యువల్ విద్యార్థులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.
ఈ సంస్కరణలో భాగంగా ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఎస్సీ విద్యార్థులకు అందిస్తున్నట్లుగానే, ఇకపై ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు కూడా ట్యూషన్ ఫీజులు, స్కాలర్షిప్లను నేరుగా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనుంది. ప్రతి ఏటా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకుంటుండగా, ప్రభుత్వం సుమారు రూ.2400 కోట్లు ఖర్చు చేస్తోంది.
అధికారిక అంచనాల ప్రకారం సుమారు 20 శాతం మంది విద్యార్థులు తమ ఆధార్ వివరాలను సవరించుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా విద్యార్థులు తమ ఆధార్ కార్డులో పేరు, ఇంటిపేరులో ఉన్న తప్పులను ఈ వేసవి సెలవుల్లోనే సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో పాటు తమ మొబైల్ నంబర్ను ఆధార్తో, ఆధార్ను బ్యాంకు ఖాతాతో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలి. అన్ని వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ప్రభుత్వం ఫీజులను మంజూరు చేస్తుంది.