Telangana Budget 2026-27: ప్రభుత్వ ఇంటర్, ఐటీఐ విద్యార్థులకు శుభవార్త.. బడ్జెట్లో కొత్త పథకం ప్రకటన
- Author : Vamsi Chowdary Korata
Date : 20-03-2026 - 1:57 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Budget 2026-27 తెలంగాణలోని ఇంటర్, ఐటీఐ విద్యార్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు, ఐటీఐ, ఏటీసీలలో చదివే విద్యార్థులకు నెలకు రూ.2,000 చొప్పున ఉపకార వేతనం అందించనున్నట్లు వెల్లడించింది.
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు భరోసా కల్పించే ఈ రెండు కీలక పథకాలను ప్రకటించారు. పాఠశాల విద్యార్థుల్లాగే ఇంటర్ విద్యార్థులకు కూడా పౌష్టికాహారం అందించే లక్ష్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. వృత్తి విద్యా కోర్సులు చదివే ఐటీఐ, ఏటీసీ విద్యార్థులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఉపకార వేతనం అందిస్తున్నట్లు వివరించారు.
మొత్తం రూ.3,24,234 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో ప్రభుత్వం విద్యాశాఖకు పెద్దపీట వేసింది. ఈ విద్యా సంవత్సరానికి గాను విద్యాశాఖకు రూ.26,674 కోట్లను కేటాయించింది. ఇందులో భాగంగానే విద్యార్థుల సంక్షేమం కోసం ఈ కొత్త పథకాలను ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఇంటర్, ఐటీఐ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.