White Ration Cards: తెలంగాణ రేషన్ కార్డుదారులకు షాక్..
- Author : Vamsi Chowdary Korata
Date : 25-05-2026 - 10:42 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో నిరుపేదలకు అందాల్సిన తెల్ల రేషన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న అనర్హులపై పౌరసరఫరాల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సమాచారంతో కార్డులు పొంది ఇన్నాళ్లూ దర్జాగా రేషన్ బియ్యాన్ని, ఇతర ప్రభుత్వ సదుపాయాలను అనుభవిస్తున్న వారి ఏరివేత ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ తనిఖీల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కొందరితో పాటు, నెలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు భారీ వేతనాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగుల పేరిట కూడా తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి ప్రత్యేకంగా కొత్త కార్డులు మంజూరు చేయించుకున్న వారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు అధికంగా ఉన్నారు. ఇన్నాళ్లూ వీరంతా తమ తల్లిదండ్రుల రేషన్కార్డుల్లో సభ్యులుగా కొనసాగడం వల్ల వీరి అసలు వివరాలు, ఆదాయం బహిర్గతం కాలేదు. ప్రస్తుతం డేటా విశ్లేషణ ద్వారా వీరి గుట్టు రట్టవడంతో అలాంటి వారి కార్డులను అధికారులు తొలగిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన తాజా నిబంధనల ప్రకారం లబ్ధిదారుల వార్షిక ఆదాయం రూ. 6 లక్షల కంటే ఎక్కువగా ఉండి, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారి కార్డులను తక్షణమే రద్దు చేస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 3.20 ఎకరాల కంటే ఎక్కువ తరి భూమి లేదా 7.20 ఎకరాల కంటే ఎక్కువ కుష్కి భూమి ఉన్న వారి రేషన్ కార్డులను కూడా ఏరివేస్తున్నారు. ప్రభుత్వ విచారణతో ఇన్నాళ్లూ లబ్ధి పొందిన అనర్హులైన కార్డుదారుల్లో ప్రస్తుతం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
అనర్హుల ఏరివేత ప్రక్రియలో నిజమైన పేదలకు, అర్హులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం పంపిన లబ్ధిదారుల ప్రాథమిక జాబితాలో సాంకేతిక పొరపాట్ల వల్ల కొందరు అర్హుల పేర్లు కూడా నమోదయ్యాయి. వార్షిక ఆదాయం రూ. 6 లక్షలుగా తప్పుగా చూపిస్తున్న వారి వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పునఃపరిశీలిస్తున్నారు. మరికొందరు లబ్ధిదారులు బ్యాంకుల నుంచి వ్యాపార, వ్యక్తిగత రుణాలు పొందటం కోసం ఐటీ రిటర్న్స్లో లేని ఆదాయాన్ని ఉన్నట్లుగా చూపించినట్లు విచారణలో వెల్లడైంది. ఇలాంటి వారికి అధికారులు నేరుగా ఫోన్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. లబ్ధిదారులు చెప్పిన సమాధానాలు, వారు సమర్పించిన పత్రాలపై విచారణ అధికారి సంతృప్తి చెందితే వారి కార్డులను యథావిధిగా కొనసాగిస్తున్నారు. అనుమానాస్పద కార్డుల విషయంలో అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారు చెప్పిన సమాచారం వాస్తవమా కాదా అనే అంశాన్ని అన్ని కోణాల్లో ఆరా తీస్తూ నివేదికలు సిద్ధం చేస్తున్నారు.