KCR: మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన కేసీఆర్..
- Author : Vamsi Chowdary Korata
Date : 15-04-2026 - 11:13 IST
Published By : Hashtagu Telugu Desk
మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన గళాన్ని వినిపించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్ రావులతో నిర్వహించిన భేటీలో జాతీయ రాజకీయ పరిణామాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. గతంలోనే తాము అసెంబ్లీలో దీనికి అనుకూలంగా తీర్మానం చేశామని గుర్తు చేస్తూ, రాజ్యసభలో తమ ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు తెలుపుతారని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో… నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం లోక్సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం ఎంపీ సీట్లు ఉన్నాయని… జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల సీట్ల శాతం (ప్రస్తుతం ఉన్న 24 శాతం) తగ్గకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఒకవేళ దక్షిణాది ప్రయోజనాలకు విఘాతం కలిగితే రాజీలేని పోరాటం చేస్తామని కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు.
ఈ నెల 20న జగిత్యాలలో జరగనున్న భారీ బహిరంగ సభ, అలాగే ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని కేటీఆర్, హరీశ్ రావులను ఆదేశించారు.