Bandi Sanjay: ఇంకెన్నాళ్లీ డైవర్షన్ పాలిటిక్స్.. కేసీఆర్ బాటలోనే రేవంత్ ప్రభుత్వం!
రైల్వేల అభివృద్ధి విషయంలో గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణకు నిధులు కేటాయిస్తూ పరుగులు పెట్టిస్తున్నం. గత పదేళ్లలో 32 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినం.
- By Gopichand Published Date - 07:23 PM, Sun - 5 January 25

Bandi Sanjay: ఇచ్చిన హామీలపై ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ను మించిపోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్, ఫోన్ ట్యాపింగ్ కేసు, డ్రగ్స్ కేసు అంటూ ప్రతినెలా ఏదో అంశంపై ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు తలమీదకు వస్తుండటంతో… కొత్తగా రైతు భరోసా పేరుతో మరో కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు.
ఇప్పటికే రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.12 వేల చొప్పున మూడు దఫాలుగా రూ.18 వేల రూపాయలు బకాయిపడ్డారని చెప్పారు. ఈ లెక్కన 70 లక్షల మంది రైతులకు రూ.19 వేల 600 కోట్ల రూపాయలు బకాయి పడ్డారని తెలిపారు. ఈ డబ్బులన్నీ జనవరి 26 నాటికి చెల్లిస్తారా? లేదా? రేవంత్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అట్లాగే నిరుద్యోగులకు ఒక్కొక్కరికి రూ.48 వేలు, మహిళలకు రూ.30 వేల చొప్పున దాదాపు రూ.50 వేల కోట్లు రేవంత్ ప్రభుత్వం బకాయి పడిందన్నారు. అట్లాగే వ్రుద్దులకు రూ.4 వేలు, పేదలకు ఇండ్ల జాగా, రూ.5 లక్షలు, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు పేరుతో లక్ష కోట్లకుపైగా బకాయి పడిందన్నారు. ఈ సొమ్ముంతా జనవరి 26 నాటికి చెల్లిస్తారా? లేదా? రేవంత్ సర్కార్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, గంగిడి మనోహర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, రాణి రుద్రమాదేవి, జెనవాడ సంగప్ప, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మలతో కలిసి బండి సంజయ్ మాట్లాడారు.
Also Read: Nalgonda: నల్గొండ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మహర్దశ
ఆ దేశంలోనైనా రైల్వే, రోడ్లు, ఏవియేషన్ వ్యవస్థ బాగుపడితే ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ పరుగులు పెడతది. అమెరికాలాంటి దేశంలో కూడా మొదట ఈ మూడు రంగాలు బాగుపడిన తరువాతే.. ఆ దేశం అగ్రదేశమైంది… అందుకే నరేంద్ర మోదీ సారధ్యంలో ఆయా రంగాలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టింది. ముఖ్యంగా చరిత్రలో ఎన్నడూ లేనంతగా మన తెలంగాణకు మోదీ ప్రభుత్వం అత్యధిక నిధులిస్తోంది. గత పదేళ్లలో మోదీ సారథ్యంలో గడ్కరీ ఆశీస్సులతో రోడ్ల విస్తరణ కోసం లక్ష కోట్లు కేటాయించింది. ఇయాళ తెలంగాణలో ఏ మూలకు పోవాలన్నా రెండు గంటల్లో రయ్ రయ్ మంటూ వెళ్లే అవకాశం ఏర్పడిందంటే అది మోదీ ఘనతే కదా… అంతెందుకు కేంద్రమే రూ.18 వేల కోట్లతో ట్రిపుల్ ఆర్ ను నిర్మిస్తున్నం… గ్రామీణ సడక్ యోజన, సీఆర్ఐఎఫ్ నిధుల ద్వారా మారుమూల గ్రామాల్లో కూడా రోడ్లను విస్తరిస్తున్నామన్నారు.
రైల్వేల అభివృద్ధి విషయంలో గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణకు నిధులు కేటాయిస్తూ పరుగులు పెట్టిస్తున్నం. గత పదేళ్లలో 32 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినం. ఈ ఒక్క ఏడాదిలోనే రైల్వే బడ్జెట్ లోనే రూ.5 వేల 336 వేల కోట్లు తెలంగాణకు కేటాయించినం. చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఎన్నడూ కేటాయించలేదు. దటీజ్ మోదీ. ఒక్కసారి సికింద్రాబాద్ చూసి రండీ. 720 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ ను ఎట్లా వరల్డ్ క్లాస్ గా తీర్చిదిద్దుతున్నడు. 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ రూపు రేఖలు మారుస్తున్నం. అంతెందుకు రేపు చర్లపల్లి కొత్త టెర్మినల్ ను మోదీ గారు వర్చువల్ గా ప్రారంభించబోతున్నరు. స్వాతంత్ర్యం వచ్చాక తెలంగాణలో మొట్టమొదటి నూతన టెర్మినల్ చర్లపల్లి మాత్రమే. రేపటి నుండి రెగ్యులర్ గా 24 ట్రైయిన్స్ చర్లపల్లి నుండి రాకపోకలు సాగించబోతున్నయ్. అట్లాగే గూడ్స్ రైళ్లన్నీ అక్కడి నుండే నడవబోతున్నయ్. దీనిద్వారా వ్యాపార, వాణిజ్య రంగానికి ఊతం కాబోతోంది. ఇప్పటికే అమ్రుత్ కింద 44 రైల్వే స్టేషన్ లను ఆధునీకరించబోతున్నం. 5 వందే భారత్ ట్రెయిన్లు నడుస్తున్నయ్… ప్రజలకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నయ్ అని ఆయన అన్నారు.
ఇగ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ తలమీదకు వచ్చినయ్. ఎందుకంటే మార్చిలోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగకపోతే 15వ ఆర్దిక సంఘం నుండి రావాల్సిన 2 వేల కోట్ల పైచిలుకు నిధులు ఆగిపోతయ్. అందుకే ఇప్పుడు రైతు భరోసా, రేషన్ కార్డులంటూ కొత్త డ్రామాను తెరపైకి తెచ్చింది. తెలంగాణ ప్రజాలారా… కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి మోసపోకండి. కేసీఆర్ కూడా గతంలో ఇట్లనే డబుల్ బెడ్రూం ఇండ్లు, రేషన్ కార్డులు, ఉద్యోగాలిస్తాననని నిండా ముంచిండు…. కాంగ్రెస్ కూడా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నయని మోసం చేయడానికి సిద్ధమైంది. 70 లక్షల మంది రైతులకు ఏటా ఎకరాకు 10 వేల చొప్పున మొన్నటి వరకు రైతు బంధు పడింది. కాంగ్రెసోళ్లు 15 వేల చొప్పున ఇస్తామని హామీ ఇస్తే రైతులంతా ఓట్లేసి గెలిపించిర్రు. అధికారంలోకి వచ్చాక ఏడాది పైసలను ఎగ్గొట్టిర్రు. ఇప్పుడేమో ఎకరాకు 12 వేలు మాత్రమే ఇస్తానంటూ కోతలు పెడుతున్నరు. నమ్మి ఓటేస్తే మోసం చేయడం ఎంత వరకు కరెక్ట్? ఈ లెక్కన చూసినా గడిచిన ఏడాది బకాయి. రాబోయే రబీ సీజన్ పైసలు కలిపితే ఎకరాకు 18 వేల చొప్పున రైతుకు బకాయి ఉన్నరు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలందరికీ ఇస్తమన్నరు. ఈ లెక్కన రైతులందరికీ 12 వేల 600 కోట్లు ఇయ్యాలే. జనవరి 26న ఆ మొత్తాన్ని రైతులకు చెల్లిస్తరా? లేదా? స్పష్టం చేయాలే. ఇప్పటికే 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ అందలే. అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ స్తామని సన్నబియ్యానికే పరిమితం చేశారు. అది కూడా 5 శాతం మంది రైతులకే బోనస్ ఇచ్చి చేతులు దులుపుకున్నరని అని మండిపడ్డారు.
ఈసారి రైతు భరోసా పైసలు ఇయ్యడం కోసం TSIIC భూముల తనఖా పెట్టి రూ.10 వేల కోట్లు తెచ్చిర్రు… ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టడానికి నువ్వెవడివి? పోనీ ఈసారి ఆ భూములను తాకట్టు పెట్టి జనానికి పంచుతున్నవ్. మరి వచ్చేసారి ఎక్కడి నుండి పైసలు తెస్తవ్? ప్రజలారా… అర్ధం చేసుకోండి. లోకల్ బాడీ ఎలక్షన్ల కోసమే రైతు భరోసా సొమ్ము చెల్లించబోతున్నరు. ఆ ఎన్నికలైపోయిన వెంటనే రైతు భరోసా బంద్ పెట్టబోతున్నరు. ఎందుకంటే పైసలే లేవు. కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదని పేర్కొన్నారు.