CM Revanth Reddy : సీఎం రేవంత్ కాన్వాయ్లోని వాహనాలు తగ్గింపు
- Author : Prasad
Date : 24-05-2026 - 3:37 IST
Published By : Hashtagu Telugu Desk
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం దృష్ట్యా ఇంధనాన్ని ఆదా చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జూబ్లీ హిల్స్ నివాసం నుంచి సచివాలయానికి కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు.. సాధారణంగా ఉండే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, జామ్మర్ వాహనం లేకుండా కేవలం మూడు వాహనాల కాన్వాయ్లో ప్రయాణించారు. రోడ్డుపై ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించలేదు. సాధారణ ట్రాఫిక్ మధ్యలో, ప్రయాణికులను ఆపకుండా ముఖ్యమంత్రి కారులో ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కాన్వాయ్ వెళుతున్నప్పుడు ప్రజలను రోడ్డుపై నిలిపివేయకపోవడాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్లో ఇంతకుముందు సుమారు 15 వాహనాలు ఉండేవని, ఈ నెల ప్రారంభంలో వాటిని తొమ్మిదికి తగ్గించారని, శనివారం నాడు మరో మూడు వాహనాలకు కుదించారని అధికారులు తెలిపారు.
ప్రధానమంత్రి ఇంధన పొదుపు చర్యలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఇంధన ఆదా కార్యక్రమాలలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు తమ వాహనాలను తగ్గించుకుంటున్నారు. ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు, తన కాన్వాయ్ పర్యటన సందర్భంగా నగరంలోని సాధారణ ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి పోలీసు అధికారులకు గతంలో ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాల్లో సాధారణ ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.