Telangana Assembly : అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలని కోరిన సీఎం రేవంత్
Telangana Assembly : ప్రజాసమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు ఆయన హాజరు కావడం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు
- By Sudheer Published Date - 01:47 PM, Thu - 5 December 24

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9 నుంచి ప్రారంభం (Telangana Assembly Sessions To Start From December 9 ) కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)ను అసెంబ్లీకి హాజరుకావాలని కోరారు. ప్రజాసమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు ఆయన హాజరు కావడం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కేసీఆర్ను సమావేశాలకు ఆహ్వానిస్తారని రేవంత్ తెలిపారు. ప్రతిపక్ష నేత సీటు ఖాళీగా ఉండటం మంచిది కాదని, సభలో వాస్తవ సమస్యలపై చర్చ జరిగేలా కేసీఆర్ తన పూర్వానుభవంతో సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. తాము అందరూ కేసీఆర్ కంటే జూనియర్ ఎమ్మెల్యేలు కాబట్టి ఆయన పెద్దరికాన్ని చూపాలని రేవంత్ అన్నారు. సభలో ప్రతిపక్ష నేతగా ఆయన అనుభవం అందరికీ ఉపయుక్తమవుతుందని పేర్కొన్నారు. ఈ సమయంలో ఆయన హాజరు కావడం ప్రజాస్వామ్యానికి మంచిదని రేవంత్ అభిప్రాయపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు సభలో ప్రవర్తనపై కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
పిల్లలు తప్పు చేస్తుంటే పెద్దలు ఆపాలని, కానీ ఇక్కడ రాక్షసులను తయారు చేసి ఉసిగొల్పడమే జరుగుతోందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇది ప్రజల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజాసమస్యల పరిష్కారానికి ఒక గొప్ప వేదిక అని, అందువల్ల ప్రతిపక్ష నేతల పాత్ర కీలకమని రేవంత్ స్పష్టం చేశారు. సభలో చర్చ జరిగేలా ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా కేసీఆర్ తన బాధ్యతలను నిర్వర్తించాలన్నారు. ఈనెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసారు. తొమ్మిదో తేదీ ఉదయం పదిన్నర గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది ముగిసిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోన్న నేపథ్యంలో అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.
ఈ సమావేశాల్లో ప్రధానంగా కొత్త రెవెన్యూ చట్టం, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, థర్మల్ పవర్ప్లాంట్లపై న్యాయ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదిక, ఫోన్ట్యాపింగ్ తదితర అంశాలను చర్చకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
Read Also : Indiramma Houses Survey App : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో వారికే ప్రయారిటీ : సీఎం రేవంత్