KCR: కేసీఆర్ కు “టీనా’ధీమా!!
తెలంగాణ లో షెడ్యూల్ ప్రకారం 2023 ఆఖరు లో ఎన్నికలు జరగాలి.అయితే గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు కచ్చితంగా వెళ్లే అవకాశం ఉందని ప్రతిపక్ష పార్టీ లతో పాటు టీ ఆర్ ఎస్ మెజారిటీ నేతలు భావిస్తున్నారు.
- By Hashtag U Published Date - 09:36 AM, Wed - 12 January 22
తెలంగాణ లో షెడ్యూల్ ప్రకారం 2023 ఆఖరు లో ఎన్నికలు జరగాలి.అయితే గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు కచ్చితంగా వెళ్లే అవకాశం ఉందని ప్రతిపక్ష పార్టీ లతో పాటు టీ ఆర్ ఎస్ మెజారిటీ నేతలు భావిస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా అదే అభిప్రాయం తో ఉన్నారు.ఎన్నికలు ముందు జరిగినా, షెడ్యూల్ ప్రకారం వచ్చినా గెలుపెవరిది అన్న చర్చ మాత్రం ఊపందుకుంది. కేసీఆర్ పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది..
ఇక టీ ఆర్ ఎస్ మరోసారి అధికారం లోకి వచ్చే ప్రసక్తే లేదని ప్రతిపక్ష శిబిరాలు ధీమా తో ఉన్నా అది అంత సులభమా అంటే కానే కాదు అని నమ్మే వారు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. కేసీఆర్ ను కాదనుకుంటే తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్నాయ నాయకుడు ఎవరు అనే ప్రశ్న ఎన్నికల సందర్భంగా వచ్చినపుడు కచ్చితంగా మొగ్గు టీ ఆర్ ఎస్ వైపే ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.రెండు జాతీయ పార్టీలకు కేసీఆర్ తో సరితూగ గలిగే నాయకుడు తెలంగాణ లో లేకపోవడం కలిసి రాని ప్రధాన అంశంగా చెప్పవచ్చు.ప్రత్యామ్నాయ లేమి నే ఇంగ్లీషులో there is no alternative లేదా టీనా అని ముద్దుగా పిలుస్తుంటారు.
గతం లో బీజేపీ వృద్ద నేత ఎల్. కె. అద్వానీ ఈ ‘టీనా’ను బాగా ప్రాచుర్యం చేశారు.జాతీయ పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ లు కేసీఆర్ వ్యతిరేకత ను ఎంత పోగు చేసినా.. చివరకు సీఎం అభ్యర్థి ఎవరు అనే అంశానికి వస్తే మాత్రం ఆ రెండు పార్టీలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితే ఉంటుంది. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లను కేసీఆర్ కు సమాన స్థాయి లో చూసే అవకాశం లేదు కనుక టీనా అంశం గులాబీ దళపతి కి కలిసి వస్తుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది.గతం లో బీహార్ లో నితీష్ కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా బీహారీ కావాలా బహరీ(బయటి వాళ్ళు) కావాలా అనే ఫాక్టర్ పనిచేసింది.
ఇటీవల బెంగాల్ లో జరిగిన ఎన్నికల్లోనూ మమత బెనర్జీ చేతిలో బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడం తో బీజేపీ పరాభవం చవి చూడక తప్ప లేదు. ఒడిశా లో నవీన్ పట్నాయక్ కు ధీటైన నాయకత్వం చూపడం లో కూడా బీజేపీ నాయకత్వం ఇప్పటివరకు సఫలం కాలేక పోయింది. తెలంగాణ లో కేసీఆర్ కు చిన్న చిన్న కారణాలతో కొంత వ్యతిరేకత తప్ప ఆయన్ను పదవీ నుంచి దించాలన్న కసి ప్రజల్లో లేదని క్షేత్ర స్థాయి రాజకీయ పరిస్థితులు గమనించిన వారు ఎవరైనా చెబుతారు.
ఎన్నికల వరకు కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ఉద్యమాలు చేసినా ..కేసీఆర్ వర్సస్ ఎవరు అనే విషయం లో నెలకొన్న సందిగ్ధత ఓటరు ను మళ్లీ టీ ఆర్ ఎస్ వైపు మొగ్గేలా చేయడం తప్పక పోవచ్చు.
Related News
Narendra Modi : ‘ధాకడ్’ ప్రభుత్వం కారణంగా ఇప్పుడు భారతదేశ శత్రువులు వణుకుతున్నారు
కేంద్రంలో 'ధాకడ్' (ధైర్యమైన) ప్రభుత్వం ఉన్నందున ఏదైనా చేయాలనే ఆలోచన చేసే ముందు భారత శత్రువులు ఇప్పుడు వందసార్లు ఆలోచించారని పాకిస్థాన్ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అన్నారు.