Lagacharla Notification: లగచర్ల నోటిఫికేషన్ రద్దు.. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల స్పందన ఇదే!
పోలేపల్లి నుండి హకీంపేట వరకు పాదయాత్ర, దీక్షలు, గ్రామాల్లో సభలు సమావేశాలు నిర్వహించి రైతులకు రైతు కుటుంబాలకు భరోసా కల్పించాం.
- Author : Gopichand
Date : 29-11-2024 - 7:49 IST
Published By : Hashtagu Telugu Desk
Lagacharla Notification: రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, భూ నిర్వాసితుల పోరాట ఫలితంగా లగచర్ల ఫార్మా కంపెనీ భూసేకరణ నోటిఫికేషన్ (Lagacharla Notification) రద్దు చేయడం పట్ల తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. లగచర్ల, హకీంపేట, రోటి బండ తండా, పులిచెర్ల తండా ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం 1374 ఎకరాలు భూ సేకరణ చేయాలని ప్రభుత్వం భావించినప్పటి నుండి ఫార్మా భూ సేకరణకు వ్యతిరేకంగా రైతాంగానికి మద్దతుగా రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కొడంగల్ లో 500 మంది రైతులతో భూ సదస్సు నిర్వహించి రైతులను సంఘటితం చేయడం జరిగింది.
Also Read: Rishiteswari Case : రిషితేశ్వరి కేసు కొట్టివేత..మాకు న్యాయం జరగలేదని తల్లిదండ్రుల ఆవేదన
పోలేపల్లి నుండి హకీంపేట వరకు పాదయాత్ర, దీక్షలు, గ్రామాల్లో సభలు సమావేశాలు నిర్వహించి రైతులకు రైతు కుటుంబాలకు భరోసా కల్పించాం. అనేక రూపాలలో పోరాటాలు నిర్వహించాం. ఈ నెల 11 జరిగిన లగచర్ల ఘటన అనంతరం రైతు సంఘం రాష్ట్ర నాయకులు గ్రామానికి సందర్శించి రైతు కుటుంబాలను పరామర్శించి వాళ్లకు వారి కుటుంబాలకు భరోసా కల్పించి, గ్రామాల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఫార్మా కంపెనీకి రైతులు భూములు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయాం. సీఎంను ప్రభుత్వాన్ని పునరాలోచించే విధంగా వామపక్షాల రాష్ట్ర నాయకత్వం కృషి చేసిన ఫలితంగా ఫార్మా భూసేకరణ నోటిఫికేషన్లు రద్దు చేయడం జరిగింది. అందుకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. భవిష్యత్తులో రైతులు ప్రజలు ఏ సమస్యలు వచ్చినా ఈ రకంగా సంఘటితంగా పోరాడితే సమస్యలు పరిష్కారం అవుతాయని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్ పేర్కొన్నారు.