Telangana: కీలకంగా మారిన నిజామాబాద్ కాంగ్రెస్ సీటు
నిజామాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోమని ఎంఐఎం స్పష్టం చేయడంతో కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటిస్తుందని అక్కడి ముస్లిం సమాజం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
- Author : Praveen Aluthuru
Date : 30-10-2023 - 8:42 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: నిజామాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోమని ఎంఐఎం స్పష్టం చేయడంతో కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటిస్తుందని అక్కడి ముస్లిం సమాజం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వగా, భారతీయ జనతా పార్టీ ధనపాల్ సూర్యనార్య గుప్తాకు టికెట్ ఇచ్చింది.
గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఎంఐఎం నిజామాబాద్ నియోజకవర్గం నుండి తన అభ్యర్థిని నిలబెట్టలేదు. కాగా అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్కు మద్దతు ఇవ్వాలని కార్యకర్తల్ని కోరింది మజ్లీస్. గణేష్ 71,896 ఓట్లతో విజయం సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి తాహిర్ బిన్ హమ్దాన్కు 46,055 ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన లక్ష్మీనారాయణ యెండల 24,192 సాధించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,98,093 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 98,224 మంది పురుషులు, 99,829 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మైనారిటీ వర్గాల ఓటర్ల సంఖ్య, 1.2 లక్షలు.
తాజాగా నిజామాబాద్ ఎంఐఎం నేతలు పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని కలిసి నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని అభ్యర్థించారు. సుదీర్ఘ చర్చల తర్వాత ఈ స్థానం నుంచి పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించింది.కాగా అక్కడ ముస్లిం అభ్యర్థిని బరిలోకి దింపాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్ను లేదా గత ఎన్నికల్లో పోటీ చేసి విఫలమైన వ్యాపారి తాహెర్ బిన్ హమ్దాన్ను పోటీకి దింపవచ్చు.
Also Read: CBN’s Gratitude Concert : చంద్రబాబు గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్న బండ్ల గణేష్..