Virat Kohli: కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. విరాట్ను చూడాలంటే ఆగస్టు వరకు ఆగాల్సిందే!
ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లండ్కు చేరుకొని తమ సన్నాహాలు ప్రారంభించారు.
- By Gopichand Published Date - 07:55 PM, Wed - 4 June 25

Virat Kohli: విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐపీఎల్ గెలవాలనే కల ఎట్టకేలకు నెరవేరింది. ఈ విజయం కోసం అతడు 18 సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. ఆర్సీబీ జట్టు ఈసారి అద్భుతమైన ప్రదర్శన కనబరిచి పంజాబ్ కింగ్స్ను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయం కేవలం ఆర్సీబీకి మాత్రమే కాదు.. విరాట్ కోహ్లీ అభిమానులందరికీ సంతోషం కలిగించే అంశం. అయితే కోహ్లీ అభిమానులు కొంచెం నిరాశకు గురి అయ్యే వార్త ఒకటీ వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే కోహ్లీ త్వరలో క్రికెట్ మైదానంలో ఆడటం కనిపించదు. అతడిని మళ్లీ బ్యాటింగ్ చేస్తూ చూడాలంటే కొంచెం ఎక్కువ సమయం ఫ్యాన్స్ వేచి ఉండాలి.
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో కోహ్లీ ఆడడు
ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లండ్కు చేరుకొని తమ సన్నాహాలు ప్రారంభించారు. కానీ విరాట్ కోహ్లీ ఈ పర్యటనలో ఉండడు. అతడు ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభం కాకముందే టెస్ట్ క్రికెట్ నుంచి అనూహ్యంగా రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఈ టెస్ట్ సిరీస్ జరిగే వరకు విరాట్ కోహ్లీ ఏ మ్యాచ్లోనూ కనిపించడు. అతని అభిమానులు అతడు మైదానంలోకి తిరిగి రావడానికి కొంచెం ఎక్కువ సమయం వేచి ఉండాలి.
Also Read: RCB : చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట..ఏడుగురు మృతి
ఆగస్టులో కోహ్లీ తిరిగి రాక
అభిమానులు విరాట్ కోహ్లీని బ్యాటింగ్ చేస్తూ చూడాలనుకుంటే ఆగస్టు వరకు వేచి ఉండాలి. ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. విరాట్ కోహ్లీ టెస్ట్, టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ వన్డే ఫార్మాట్లో ఇప్పటికీ ఆడుతూనే ఉంటాడు. భారత్- బంగ్లాదేశ్ మధ్య మొదటి వన్డే మ్యాచ్ ఆగస్టు 17న జరగనుంది. అదే రోజు విరాట్ కోహ్లీ మైదానంలోకి తిరిగి రావొచ్చని తెలుస్తోంది.