టీ20 వరల్డ్ కప్ 2026.. బోణీ కొట్టిన టీమిండియా!
ఈ మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ గోల్డెన్ డక్ (తొలి బంతికే అవుట్)గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.
- Author : Gopichand
Date : 07-02-2026 - 11:02 IST
Published By : Hashtagu Telugu Desk
India Beat USA: టీ20 వరల్డ్ కప్ 2026లో యూఎస్ఏ (USA)తో జరిగిన మ్యాచ్లో భారత్ అద్భుత విజయాన్ని సాధించి తన జైత్రయాత్రను కొనసాగించింది. ఈ మ్యాచ్లో భారత్కు ఆరంభం అంతగా కలిసిరాకపోయినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ వీరోచిత అర్ధశతకంతో భారత్ భారీ స్కోరు సాధించింది. అనంతరం బౌలర్లు రాణించడంతో భారత్ 29 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
సూర్య మినహా విఫలమైన బ్యాటర్లు
ఈ మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ గోల్డెన్ డక్ (తొలి బంతికే అవుట్)గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అతను 16 బంతుల్లో 20 పరుగులు చేశాడు. మూడో స్థానంలో వచ్చిన తిలక్ వర్మ 16 బంతుల్లో 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఒకానొక దశలో భారత్ పవర్ప్లే ముగిసేసరికి 46 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Also Read: మరణానికి ముందు కనిపించే సంకేతాలివే!
అయితే సూర్యకుమార్ యాదవ్ ఒకవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలతో నిలబడి 49 బంతుల్లో 84 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. సూర్య మెరుపులతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 161/9 పరుగులు చేయగలిగింది. యూఎస్ఏ బౌలర్లలో షెడ్లీ వాన్ షాల్క్విక్ అద్భుతంగా బౌలింగ్ చేసి, 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
యూఎస్ఏకు తప్పని ఓటమి
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్ఏ బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి తలవంచారు. ఓపెనర్ ఆండ్రీస్ గౌస్ 6 పరుగులు, సైతేజ ముక్కామల్లా 2 పరుగులు మాత్రమే చేశారు. కెప్టెన్ మోనాంక్ పటేల్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే సున్నా పరుగులకు అవుట్ అయి నిరాశపరిచాడు. మిలింద్ కుమార్ (34 బంతుల్లో 34), సంజయ్ కృష్ణమూర్తి (31 బంతుల్లో 37) కాసేపు పోరాడినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్లకు చెరో రెండు వికెట్లు దక్కాయి.