Suryakumar Yadav : ముంబై కొత్త సారథిగా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు!
- By Vamsi Chowdary Korata Published Date - 01:04 PM, Fri - 21 November 25
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. దక్షిణాఫ్రికాతో టీ 20 సిరీస్కు ముందు ముంబై తరఫున ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ఎంసీఏకు తెలియజేశాడట. టీ20 వరల్డ్ కప్ 2026 లక్ష్యంగా ఈ టోర్నీలో పూర్తిగా అందుబాటులో ఉంటానని ఎంసీఏకు హామీ ఇచ్చాడు. శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా వైట్ బాల్ ఫార్మాట్లకు సూర్యకుమార్ నేతృత్వం వహించనున్నాడు.
భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 2025 – 26 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్ధమయ్యాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) సీనియర్ సెలెక్షన్ కమిటీ శుక్రవారం సమావేశమవ్వగా, సూర్యకుమార్ తన సేవలు అందుబాటులో ఉన్నట్లు స్పష్టంగా తెలియజేశారని సమాచారం. దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనలో భాగంగా జరగనున్న ఐదు టీ20 మ్యాచ్లకు ముందు, ముంబై తరఫున లీగ్ దశ మ్యాచ్లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
టీ20 వరల్డ్ కప్ 2026ను లక్ష్యంగా సయ్యద్ ముస్తాక్ అలీ మ్యాచ్లకు పూర్తిగా అందుబాటులో ఉంటానని సూర్యకుమార్ ఎంసీఏకు తెలిపారని సమాచారం. నవంబర్ 26 నుంచి లక్నోలో ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లీగ్ మ్యాచ్లలో ముంబై పాల్గొనగా, డిసెంబర్ 6, 8న జరిగే చివరి రెండు లీగ్ మ్యాచ్లలో సూర్య పాల్గొంటారా అన్న ఆసక్తి నెలకొంది. ఎందుకంటే డిసెంబర్ 9న భారత్ – దక్షిణాఫ్రికా తొలి టీ20 మ్యాచ్ కటక్లోని బారాబతి స్టేడియంలో ప్రారంభం కానుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రైల్వేస్, విదర్భ, ఆంధ్ర, అస్సాం, కేరళ, ఛత్తీస్గఢ్, ఒడిశా జట్లతో ముంబై పోటీపడనుంది.
ఈ సీజన్లో రంజీ ట్రోఫీకి శార్ధూల్ ఠాకూర్ను కెప్టెన్గా ఎంపిక చేసిన ఎంసీఏ వైట్ బాల్ ఫార్మాట్లకు శ్రేయస్ అయ్యర్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని భావించింది. అయితే అయ్యర్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో, అలాగే సూర్యకుమార్ లభ్యమవ్వడంతో ముంబై తమ టైటిల్ రక్షణ కోసం భారత టీ20 కెప్టెన్కే కమాండ్ అప్పగించనుంది.
పుదుచ్చేరిపై రంజీ మ్యాచ్ను ఆడటం కుదరని సూర్యకుమార్ ఎంసీఏకు ముందుగానే చెప్పేశాడు. ఇదే విధంగా దక్షిణాఫ్రికా టీ20 సిరీస్కి సన్నద్ధం కావాలన్న కారణంతో శివమ్ దూబేకి కూడా రంజీ మ్యాచ్ నుంచి ఎంసీఏ సెలవు ఇచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్స్లో విదర్భపై ఆడిన తర్వాత సూర్య ముంబై తరఫున మళ్లీ ఆడలేదు. దేశీయ సీజన్ మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్ బిజీ షెడ్యూల్ కారణంగా స్కై ముంబై జట్టుకు దూరంగా ఉన్నాడు.