Lucknow Super Giants: చివరి బంతి వరకు ఉత్కంఠ.. లక్నోపై పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్!
ముంబై ఇండియన్స్ తమ మునుపటి మ్యాచ్ను 8 వికెట్ల తేడాతో గెలిచి ఈ మ్యాచ్కు వచ్చింది. ఈసారి లక్నో 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ముందు ఉంచింది.
- By Gopichand Published Date - 11:46 PM, Fri - 4 April 25

Lucknow Super Giants: లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants).. ముంబై ఇండియన్స్ను 12 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 203 పరుగులు సాధించగా, దానికి బదులుగా ముంబై ఆఖరి ఓవర్ వరకు సాగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో 191 పరుగులు మాత్రమే చేసి 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముంబై తరపున సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ సాధించినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. లక్నో ఆటగాళ్లు మిచెల్ మార్ష్, ఎడెన్ మార్క్రమ్లు కూడా ఈ మ్యాచ్లో తొలుత అర్ధసెంచరీలు సాధించారు.
లక్నో-ముంబై మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది
ముంబై ఇండియన్స్ తమ మునుపటి మ్యాచ్ను 8 వికెట్ల తేడాతో గెలిచి ఈ మ్యాచ్కు వచ్చింది. ఈసారి లక్నో 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ముందు ఉంచింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఆరంభం చాలా పేలవంగా ఉంది. రోహిత్ శర్మ మోకాలి గాయం కారణంగా ఈ మ్యాచ్ ఆడలేదు. దీంతో విల్ జాక్స్, రాయన్ రికెల్టన్ ముంబై తరపున ఓపెనింగ్ చేశారు. కానీ 17 పరుగుల వద్ద జాక్స్ (5 పరుగులు) , రికెల్టన్ (10 పరుగులు) ఇద్దరూ వికెట్లు కోల్పోయారు.
Also Read: Hardik Pandya: చరిత్ర సృష్టించిన ముంబై కెప్టెన్.. లక్నోపై ఐదు వికెట్లతో చెలరేగిన పాండ్యా!
సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్ ముంబైని మ్యాచ్లోకి తీసుకొచ్చారు. వీరిద్దరి మధ్య 69 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొంది. నమన్ ధీర్ 24 బంతుల్లో 46 పరుగులు చేయగా, సూర్య 43 బంతుల్లో 67 పరుగులతో రాణించాడు. ఆఖరి 5 ఓవర్లలో ముంబైకి 61 పరుగులు అవసరం ఉండగా.. సూర్య క్రీజ్లో సెట్ అయి ఉండటంతో విజయం సాధ్యమనిపించింది. కానీ 67 పరుగుల వద్ద సూర్యా ఔట్ కావడంతో మ్యాచ్ ముంబై చేతుల్లోంచి జారిపోయింది.
శార్దూల్ ఠాకూర్ ఓవర్ మ్యాచ్ను తిప్పేసింది
ఆఖరి 2 ఓవర్లలో ముంబైకి 29 పరుగులు అవసరం ఉండగా క్రీజ్లో హార్దిక్ పాండ్యా- తిలక్ వర్మ ఉన్నారు. వీరితో ఈ లక్ష్యం సాధించడం సాధ్యమనిపించింది. కానీ 19వ ఓవర్ మ్యాచ్ను గెలిపించగలదని, లేదా చెడగొట్టగలదని అంటారు. ఇక్కడ శార్దూల్ ఠాకూర్ 19వ ఓవర్లో లక్నో తరపున మ్యాచ్ను తిప్పేశాడు. ఆ ఓవర్లో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆఖరి ఓవర్లో ఆవేశ్ ఖాన్కు 21 పరుగులు డిఫెండ్ చేయడానికి అవకాశం లభించింది. ఆవేశ్ మొదటి బంతికి సిక్సర్ ఇచ్చినప్పటికీ.. తర్వాతి బంతుల్లో బలంగా పుంజుకుని లక్నోకు 12 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు.