Amanpreet Singh: కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ప్లేయర్ కన్నుమూత
- Author : Vamsi Chowdary Korata
Date : 07-05-2026 - 10:31 IST
Published By : Hashtagu Telugu Desk
భారత క్రికెట్ రంగంలో విషాదం చోటుచేసుకుంది. భారత మాజీ అండర్-19, పంజాబ్ మీడియం పేసర్ అమన్ప్రీత్ సింగ్ గిల్ (36) బుధవారం చండీగఢ్లో మృతి చెందారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఒకప్పుడు విరాట్ కోహ్లీతో కలిసి అండర్-19 జట్టులో ఆడిన అమన్ప్రీత్ హఠాన్మరణం క్రీడా వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
అమన్ప్రీత్ సింగ్ గిల్ పంజాబ్ తరఫున ఆరు ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడి 11 వికెట్లు పడగొట్టారు. 2008లో జరిగిన ఐపీఎల్ ఆరంభ సీజన్లో ఆయన పంజాబ్ ఫ్రాంచైజీ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) జట్టులో సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా కూడా ఆయన సేవలు అందించారు. 2007లో భారత అండర్-19 జట్టు తరఫున ఐదు యూత్ వన్డేలు, ఒక యూత్ టెస్టు ఆడారు. ఆ టెస్టు మ్యాచ్లో శ్రీలంక మాజీ ఆల్రౌండర్ తిసారా పెరీరా వికెట్ను కూడా తీశారు. అయితే, 2008లో విరాట్ కోహ్లీ నేతృత్వంలో ప్రపంచకప్ గెలిచిన భారత అండర్-19 జట్టులో మాత్రం ఆయనకు స్థానం దక్కలేదు.
అమన్ప్రీత్ మృతి పట్ల పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. “పంజాబ్ మాజీ క్రికెటర్, సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడు అమన్ప్రీత్ సింగ్ గిల్ మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం” అని పీసీఏ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
సంతాపం తెలిపిన యువరాజ్ సింగ్
భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కూడా అమన్ప్రీత్కు నివాళులర్పించారు. “అమన్ప్రీత్ సింగ్ గిల్ మరణ వార్త విని చాలా బాధపడ్డాను. మా కెరీర్ ఆరంభ రోజుల్లో మేము డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాం. అతను నిశ్శబ్దంగా, కష్టపడి పనిచేసే క్రికెటర్. ఆయన కుటుంబానికి, ప్రియమైన వారికి నా హృదయపూర్వక సానుభూతి. ఓం శాంతి” అని యువరాజ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా తమ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అమన్ప్రీత్ మృతి పట్ల సంతాపం ప్రకటించింది.